ట్రబుల్ షూటర్ ట్రయల్ రన్ సక్సెస్ అభివృద్ధి వైపు కదిలిన ఖేడ్ ఊహించని రీతిలో తరలివచ్చిన జనం మంత్రి హరీశ్రావుకు బ్రహ్మరథం విజయోత్సవంలా అభ్యర్థి నామినేషన్ సభ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
అభివృద్ధి కోరుకునే వారికి అదో సంబురం.. వెనుకబాటుకు వంత పాడిన వారికి అదో చెంపపెట్టు.. మార్పు కోసం తపించే వారిలో ఉరకలేసిన ఆనందం కలగలిసి సోమవారం నారాయణఖేడ్లో టీఆర్ఎస్ బహిరంగ సభ, భారీ జనసందోహం మధ్య నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆవిష్కృతమైన సదృశ్యం ఇది. కనీవిని ఎరుగని రీతిలో భారీగా తరలివచ్చిన జనవాహిని నారాయణఖేడ్లో మార్పును కోరుకుంటుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. నాలుగు నెలలుగా ట్రబుల్షూటర్గా పేరొందిన మంత్రి హరీశ్రావు నారాయణఖేడ్ను అభివృద్ధి వైపు నడిపిస్తే.. ప్రజలు టీఆర్ఎస్ వెంట నడుస్తున్నారనడానికి జన సంద్రమైన దృశ్యాలే నిదర్శనం. ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్రావు చేసిన ట్రయల్న్ సక్సెస్ అయింది. పట్టణంలో ఏ రోడ్డు చూసినా.. ఏ వీధి చూసినా గులాబీమయంగా కనిపించడం విపక్ష పార్టీల నాయకుల్లో గుబులు రేపగా, కాంగ్రెస్కంచుకోటను ఓ కుదుపు కుదిపింది. సోమవారం నాటి జనదృశ్యం అరవై ఏళ్లుగా అంటిపెట్టుకున్న అభిమానాన్ని వెనక్కు నెట్టి మార్పు కోరుతూ ముందడుగేసిందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
నభూతో నభవిష్యత్తు.. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం నిర్వహించిన భారీ బహిరంగసభ, ర్యాలీ నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో జరిగింది. రాజకీయంగా విభిన్నమైన నారాయణఖేడ్లో గతంలో బలప్రదర్శన కోసమేననే రీతిలో పోటాపోటీగా జనాన్ని సమీకరించిన సందర్భాల్లోనూ ఈస్థాయిలో ప్రజలు హాజరు కాకపోగా టీఆర్ఎస్ బహిరంగసభకు మాత్రం ఊహించని రీతిలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందగా తరలి రావడం విశేషం. నారాయణఖేడ్ నలుమూలలు గులాబీమయం కాగా సభ నిర్వహించిన రెహమాన్ ఫంక్షన్హాల్ వద్ద నుంచి కిలోమీటర్ పోడవున రోడ్డు సభకు వచ్చిన జనంతో కిక్కిరిసి పోయిందంటే జనసందోహం ఏపాటిదో అర్థమవుతుంది. గతంలో ఆలస్యంగా నిర్వహించిన సభలు, సమావేశాలకు కూడా ఈ స్థాయిలో జనం వచ్చిన దాఖలాలు లేకపోగా సోమవారం నాటి టీఆర్ఎస్ సభ త్వరగా ప్రారంభించి మధ్యాహ్నం 2గంటల్లోపే పూర్తి చేసినప్పటికీ ఊహించిన రీతిలో జనం రావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. నామినేషన్ దాఖలు పూర్తయిన వెంటనే బయటకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి వద్దకు చేరుకున్న కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఆయనను ఎత్తుకుని మరీ చిందులు వేయడం ఇక్కడి ప్రజలు అభివృద్ధిని, టీఆర్ఎస్ ప్రాతినిధ్యాన్ని ఎంతగా కోరుకుంటున్నారో చెప్పకనే చెప్పింది.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి హరీశ్రావు సోమవారం బహిరంగ సభలో మంత్రి హరీశ్రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతను భుజానేసుకుని నాలుగు మాసాలుగా ఆయన చేసిన కృషి ఫలితంగానే వెల్లువలా జనవాహిని తరలి వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సభ ముగియగానే గులాబీ రంగు ఓపెన్టాప్ వాహనంలో ర్యాలీగా బయలుదేరిన హరీశ్రావుపై దారిపోడవునా పూలవాన కురిపించారు. ఉరకలెత్తిన అభిమానంతో అశేష ప్రజానీకం ముందుకు కదులుతుంటే హరీశ్రావు వాహనంపై నుంచి ఒకసారి విజయ సంకేతం, మరోసారి బోటన వేలు చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, జిల్లాలోని ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీఆర్ఎస్ ముఖ్యనేతలు తరలివచ్చి సభలో పాల్గొనడం ఇక్కడి ప్రజల్లో మరింత భరోసానింపింది. సభలో మంత్రి హరీశ్రావు తన ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీ తప్పులను ఎండగట్టడం, టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి పేరును ప్రస్తావించిన సందర్భాల్లో సభలోని జనం కేరింతలు కొడుతూ స్పందించిన తీరు మరింత ఊపునిచ్చింది.
మార్పు చూపిన సభ టీఆర్ఎస్ బహిరగ సభ ఇక్కడి రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పును కళ్లకు కట్టిందనడంలో అతిశయోక్తి లేదు. గతంలో జనసమీకరణ అయినా బల ప్రదర్శన అయినా కాంగ్రెస్, టీడీపీలకే సాధ్యమనే అభిప్రాయం ఉండేది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగంగా నారాయణఖేడ్లో ఉద్యమాన్ని ఉరకలెత్తించినప్పటికీ, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా ఇక్కడి విపక్ష పార్టీల నాయకులు వేయాల్సిన ఎత్తులన్ని వేశారనే అభిప్రాయాలున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక మాత్రం ప్రజలకు కనువిప్పు కలిగించిందని సభకు హాజరైన జనంతో తేటతెల్లమవుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే నానుడిని గుర్తెరిగి గులాబిబాట పట్టిన జన నీరాజనమే టీఆర్ఎస్ బహిరంగ సభ దృశ్యాలుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణఖేడ్ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా బహిరంగసభకు అసంఖ్యాకంగా జనం తరలిరావడం ఇటు నూతనోత్సాహంలో ఉన్న గులాబీ శ్రేణుల్లోనూ మరో వైపు రాజకీయ వర్గాల్లోనూ టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఖాయమనే చర్చకు దారితీస్తుండడం కొసమెరుపు.

