హైదరాబాద్ నగర అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పారు. తాను మొండివాడినని చెప్పిన కేసీఆర్.. హైదరాబాద్ను విశ్వనగరం చేసి తీరుతానని ప్రతినబూనారు. అవినీతి రహిత నగరపాలనకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి.. లంచం ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజలు పని చేయించుకోగలిగిన రోజు రావాలని ఆకాంక్షించారు. -విశ్వనగరానికి కలకంటున్నా.. చేసి చూపిస్తా -కేసీఆర్ మొండోడు.. ఏం జెప్పిండో అది చేస్తడు -పనిచేసే ప్రభుత్వానికే పట్టంకట్టండి: కేసీఆర్ -చంద్రబాబూ… మా బజార్లు మేమే ఊడ్చుకుంటం -పక్క రాష్ట్ర సీఎంతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు -అప్పుడు తెలంగాణకు అడ్డం.. ఇప్పుడు అభివృద్ధికి అడ్డం -ప్రజల మధ్య చిచ్చుపెట్టే పన్నాగం.. నీ కుట్రలను జనం మర్చిపోలేదు -హైదరాబాద్ను డల్లాస్కన్నా గొప్పగ అభివృద్ధి చేస్తం -నగర ప్రచారంలో సమస్యలన్నీ తెలుసుకున్న కేటీఆర్కే పురపాలక శాఖ -పరేడ్గ్రౌండ్స్లో భారీ ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని ప్రయాణం ప్రారంభించిందన్న కేసీఆర్.. ఈ సమయంలో జరుగుతున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే సమయంలో అడ్డంపడిన చంద్రబాబు.. ఇప్పుడు అభివృద్ధికి అడ్డంపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు చాలా పని ఉందని, ఆయన అక్కడ పని చేసుకుంటే మేలని హితవు పలికారు. ప్రచార హోరులో కొట్టుకుపోకుండా ఆలోచించి ఓటేయాలని నగర ప్రజలను ఆయన కోరారు. విస్తృత ప్రచారం చేసిన సమయంలో నగర సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్న మంత్రి కేటీఆర్కు మున్సిపల్ శాఖ ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఇంతమంది ఈ సభకు వచ్చారంటే బల్దియాపై గులాబీ జెండా ఎగిరట్టేనని ఆయన సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
పెద్దసంఖ్యలో కదిలివచ్చిన అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు శుభాభివందనం. హైదరాబాద్ తెలంగాణ రాష్ర్టానికే గుండెకాయ. హైదరాబాద్ నగరానికి ఎన్నికలు జరగుతున్నయి. ఈ నగరంలో అనేక మంది మేధావులు, విద్యావేత్తలు అందరూ ఉన్నరు. సభలో ఉన్నవారుగానీ, నా ఉపన్యాసం టీవీల్లో వింటున్నవారికిగానీ వినయ పూర్వకంగా ఒకటే మనవి చేస్తున్నా.. కష్టపడి 15ఏండ్లు సుదీర్ఘ పోరాటంచేసి, ఈ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నం. అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, లాఠీచార్జీలు, జైళ్లు, నిరాహారదీక్షలు, ఆమరణ దీక్షలు, ఆత్మబలిదానాలు.. వీటన్నింటి సమాహారంగా తెలంగాణ తెచ్చుకున్నం. ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొని ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో జరుగుతున్న ఈ మహానగర పాలక సంస్థ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.
దయచేసి నగరంలో ఉన్నవాళ్లు ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి, రాజకీయ పార్టీలు సృష్టించే హోరులో కొట్టుకుపోకుండా విజ్ఞతతో.. జాగ్రత్తగా నిర్ణయించి బల్దియా ఎన్నికల్లో పాల్గొనాలి. 2001లోప్రారంభించిన ఉద్యమం 2004కొచ్చేసరికి ఫలితం మనకొచ్చింది. 2004లో నేను కూడా తెలంగాణను ఢిల్లీకి తీసుకుపోయిన. ఆనాడు యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రామ్లో పెట్టింది. ఆరోజు నేను అక్కడ ఉన్న నాయకత్వాన్ని అడిగినప్పుడు.. హైదరాబాద్ మీద మీరేమన్నా రాజీ పడతరా? తెలంగాణ తొందరగ ఇస్తమన్నరు. ఈ విషయం అందరికీ తెలుసు. నేను ఏ కొద్దిగ రాజీపడినా 2006, 2007లోనే మనకు తెలంగాణ వచ్చేది. నేను చెప్పిన.. నా ప్రాణం పోయినా సరే.. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ.. గుండెకాయలేని మొండెమిస్తామంటే తీసుకోవడానికి మేము సిద్ధంగ లేం.. కచ్చితంగా హైదరాబాద్తో కూడిన తెలంగాణనే కావాలని ఆరోజు చెప్పిన. అందుకోసమే హైదరాబాద్తో కూడిన, సర్వహక్కులు తెలంగాణకే, తెలంగాణ ప్రజలకే దక్కేలా.. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది.
తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు.. రోశయ్యగారు సీఎంగా ఉండి 14ఎఫ్ తీసుకువచ్చినరు. దాని మీద సిద్ధిపేట సభలో ప్రకటించి నేను ఆమరణ దీక్షకు పూనుకున్న. పది, పదకొండు రోజులకు నేను చావుకు సిద్ధంగ అయిపోయిన. ఆ సమయంలో చాలా ఉద్యమం చెలరేగింది. గ్రామాలన్నీ యుద్ధరంగాలయినయి. హైదరాబాద్ మొత్తం పోరాటానికొచ్చింది. ప్రజల ఐకమత్యాన్ని చూసి ఆనాడు యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి, తెలంగాణ ఇస్తమని ప్రకటించింది. ఆ తర్వాత మొదలైంది నాటకం. నిన్న, మొన్న హైదరాబాద్లో తిరిగినటువంటి చంద్రబాబు, ఇంకా చాలామంది నాయకులు కుట్ర చేసి, వచ్చిన దాన్ని రాకుండా అడ్డుకున్న నాటకం తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. తెలంగాణ వచ్చే సమయంలో కూడా హైదరాబాద్ను కేంద్ర పాలితం చేయాలని ఇదే చంద్రబాబు మాట్లాడిన విషయం మనకు తెలుసు. అటువంటి తరుణంలో గట్టిగా నిలబడి, అనేక మంది నాయకులు గట్టి పోరాటం చేసి మనం తెలంగాణను హైదరాబాద్ సహా తెచ్చుకున్నం.
ప్రజలే తీర్పు ఇచ్చినరు… ప్రజలు తీర్పు ఇచ్చినరు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం మీరిక్కడ పని చేయండి. చంద్రబాబూ నువ్వక్కడ ఆంధ్రలో పని చేయమని చెప్పినరు. ఆయనకు అక్కడ పని ఉన్నది. నీకు ప్రజలక్కడ అవకాశమిచ్చిండ్రు. మా పని మేమే చేసుకుంటమని నేను చెప్పిన. మీ దగ్గర బజార్లూడుసుకోవాల్నంటె హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు నీకు బోలెడు బజార్లున్నయి. మా హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటం.
చేస్తమని చెప్పగలిగేది టీఆర్ఎస్ ఒక్కటే.. ప్రాజెక్టులు కట్టుకోవాలె. మంచినీళ్లు తెచ్చుకోవాలె. హైదరాబాద్ సిటీలో ఉండాల్సిన సదుపాయాలు లేవు. మేం రాజ్యం చేసి నం. మా అంత గొప్పోళ్లులేరని ఇయాల కాంగ్రెస్, టీడీపీ ఓట్లు అడుగుతున్నయి. మిమ్మల్ని ఒకటే కోరుతున్న. ఈ 60ఏండ్లు ఈ బల్దియా మీద, రాష్ట్రం మీద అధికారం చెలాయించిందెవరు? ప్రజలకేదైనా చేస్తామని చెప్తున్న కొత్త పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్, టీడీపీ మీరు చూసిన పార్టీలే. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆనాడు తెలంగాణ కోసం ఎైట్లెతే పోరాటం చేసినమో.. అదే పద్ధతిలో హైదరాబాద్ను కూడా బ్రహ్మాండంగా చేసుకుంటం. టీఆర్ఎస్ని గెలిపిస్తేనే బ్రహ్మండంగా పని జరుగుతది.
వీటికి బాధ్యులెవరు? హైదరాబాద్లో కోటి జనాభా ఉంది. కూరగాయల మార్కెట్లు ఎన్నుండాలె? 50వేల మందికొకటి ఉన్నా.. 200 మార్కెట్లుండాలె. ఇయాల ఏడే ఉన్నయి. ఇదీ చంద్రబాబు, నలభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మనకిచ్చిన బహుమానం. ఇయాల ఆడబిడ్డలు గ్రామాల నుంచి, జిల్లాల నుంచి షాపింగ్కు వస్తే మూత్రం పోయడానికి సదుపాయం ఉందా? పబ్లిక్ టాయిలెట్లు ఎన్నుండాల్నో అన్ని ఉన్నయా? దీనికి ఎవరు జావాబుదారీ? పేదరికానికి ఎవరు జవాబుదారీ? హైదరాబాద్లో ఉన్న గుడిసెలకు ఎవరు జవాబుదారీ? మూసీ నదిని మురికి కంపు నదిగా మార్చిన ఘనత కాంగ్రెస్, టీడీపీ వాళ్లది కాదా? హుస్సేన్సాగర్.. మంచినీటి జలాశయాన్ని కాలుష్య కాసారంగా మార్చిన ఘనత మీది కాదా?
డబుల్ బెడ్రూం వేరే రాష్ట్రంలో ఉందా? కొందరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. దత్తాత్రేయ.. ఆయన పెద్దాయన అనుకున్న. ఇయాల ఆయన కూడా అబద్ధాలు మాట్లాడున్నరు. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కేసీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు కడుతున్నాడని చెప్తున్నరు. లేకుంటే కట్టలేడంటున్నరు. దత్తాత్రేయగారూ.. కేంద్ర మంత్రిగా నిజాయతీగా.. రేపు ప్రెస్మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడైనా ఉందా? గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో మీ ప్రభుత్వమే ఉంది కదా.. మీ సీఎంలే ఉన్నారు కదా! ఆ రాష్ర్టాల్లో డబుల్బెడ్రూం పథకం ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబుతో నువ్వు హైదరాబాద్లో ప్రచారం చేసినవు.. నువ్వు ఏ చంద్రబాబుతో తిరిగినవో.. ఆ ఆంధ్రప్రదేశ్లో డబుల్బెడ్రూం స్కీం ఉందా? ఏదిపడితే అది చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎప్పుడు చెప్పిండు కేసీఆర్ డబుల్బెడ్రూం ఇస్తామని! 2014 ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలోనే చెప్పినం. వాస్తవాలు ఇలా ఉంటె.. అవాకులు చెవాకులు చెప్పి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు.
బాబూ.. కార్మికుల పొట్టకొట్టిందే నువ్వు నేను హైదరాబాద్లోనే ఉంటానని చంద్రబాబు మాట్లాడుతన్నడు. అర్ధగంటలోనే విజయవాడ నుంచి వస్తా.. అడుగడుగునా నా ముద్ర ఉందంటడు. అవును.. చంద్రబాబు ముద్ర ఉంది.. బషీర్బాగ్లో పోలీసుల కాల్పుల్లో నలుగురు చచ్చిపోయిన రక్తపు ముద్ర అక్కడే ఉన్నది. అసెంబ్లీ ముందల అంగన్వాడీ అక్కచెల్లెళ్లను గుర్రాలతో తొక్కించిన ముద్ర అక్కడనే ఉన్నది. మూసీ మురికి కంపు ముద్ర ఇంకా ఉన్నది. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను దేశంలో తెచ్చిందే నీ ముద్ర. ఇయాల ఆ ముద్రను తిప్పి వాళ్లను పర్మినెంటు చేసే ముద్రను తెలంగాణ ప్రభుత్వం గుద్దుతున్నది. వాళ్ల కడుపునింపే ప్రయత్నం చేస్తున్నం. నువ్వో దోపిడీదారునివి. పెట్టుబడిదారుల పక్కన నిలబడ్డవు. కార్మికుల శ్రమదోచినవు.. కడుపులు కొట్టినవు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తున్నది.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ.. కేవలం 18 నెలల కాలంలో 190 సంక్షేమ కార్యక్రమాలు చేసినం. అడుగని కార్యక్రమాలు కూడా చేసినం. ఆటోడ్రైవర్లు మా ట్యాక్సులు రద్దుచేయమని దరఖాస్తు పెట్టుకోలె. వాళ్లకు ట్యాక్సులు రద్దు చేసినం. 72కోట్ల బకాయిలు మాఫీ చేసినం. రాష్ట్రంలో ఆటో కార్మికులకు రవాణా పన్ను మొత్తం రద్దు చేసినం. 15లక్షల మంది భనవ నిర్మాణ కార్మికులకు ప్రమాదం జరిగితే 5 లక్షలకు బీమా సౌకర్యం కల్పించింది వాస్తవం కాదా? పది లక్షల మంది డ్రైవర్లకు 5 లక్షల బీమా కల్పించింది నిజం కాదా? సఫాయన్నా.. మీకు సలామన్నా.. అని జీహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచిన మాట నిజం కాదా?
హోం గార్డుల జీతాలు పెంచలేదా? ట్రాఫిక్ పోలీసుల కోసం 30% అదనపు వేతనం ఇచ్చి ఆదుకుంటున్న విషయం నిజంకాదా? తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వాలని మహారాష్ట్రలో పోలీసులు అక్కడి సీఎంను అడుగుతున్నరు. మిషన్ భగీరథ కింద తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నట్టు నాకు ఓటేస్తే బీహార్లో కూడా తెలంగాణ మోడల్లో మంచినీటి పథకం పెడతానని బీహార్ సీఎం చెప్తున్నరు. 18నెలల పాలనలో దేశంలో అనేక ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కాపీ కొడుతున్నయి. ఇక్కడి మంచిని తీసుకుంటున్నయి.
చంద్రబాబు మాట వింటే ఇబ్బందులే చంద్రబాబు వచ్చి చక్కిలిగింతలు పెట్టి.. మయోపాయం చేసి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను కలకలం చేసే ప్రయత్నం చేస్తున్నడు. హైదరాబాద్లో ఉన్న ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాైళ్లెనా అందరూ సంతోషంగా ఉన్నరు. అనవసరంగా బాబు మాటలు వింటే ఇబ్బంది పడుతం తప్ప వచ్చేది కూడా ఏమీ లేదు.
హైదరాబాద్లో ఉండకు సుమా.. సీపీఐ నారాయణ నాకు మంచి దోస్తు. నిన్నటి నుంచి నాకు పెద్ద రంది పట్టుకున్నది. టీఆర్ఎస్ సొంతంగా జీహెచ్సీఎం మీద గెలిస్తే చెవి కోసుకుంటా అన్నరు. నేను చెప్తున్న.. నారాయణా.. ఐదో తారీఖు మాత్రం హైదరాబాద్ల ఉండకు సుమా! ఎవలన్నా పట్టి చెవి కోస్తే.. నిన్ను ఈఎన్టీ దవాఖన్లఏసి ట్రీట్మెంట్ చేయించాలె. ఇదివరకే ఓసారి గాంధీ జయంతి రోజు మాంసం తిన్నరు. తిన్నందుకు తప్పొకొని ఏడాది మాంసం బంద్ జేసిండు. ఇపుడు కూడా మళ్లా చెవి కోసుకుంటా.. కాలుకోసుకుంటా! ఎందుకీ బేల ముచ్చట్లన్నీ?! మొన్న వరంగల్కొచ్చింది ఇదే ముఠా. ఒకడు తొడ కోసుకుంటానంటె.. ఒకడు మెడకోసుకుంటానంటడు! దంచుడు దంచితే అన్నీ పార్టీల డిపాజిట్లు పోయినయి. అదే ముఠా ఇప్పుడు పట్నంల తేలింది. మళ్ల ఇక్కడకొచ్చి చెవికోసుకుంట.. ముక్కుకోసుకుంట.. అని మాట్లాడుతున్నరు. ఎవలది ఏం కోయాల్నో రెండో తారీఖున ప్రజలు నిర్ణయం చేస్తరు.
40 టీఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్లు చంద్రబాబునాయుడు, బీజేపీ.. వీళ్లు మనకేంజేసిండ్రండి? గవర్నమెంటు వచ్చీరాంగనే ఖమ్మంజిల్లాలో ఏడు మండలాలు గుంజుకున్నరు. గుంజుకున్నోడు చంద్రబాబునాయుడు.. గుంజిచ్చినోడు వెంకయ్యనాయుడు! వీళ్లకా ఓటేయాల మనం? హైదరాబాద్కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నయి? 170 కిలోమీటర్లు నాగార్జునసాగర్నుంచి, 200 కి.మీ గోదావరి ఎల్లంపల్లి నుంచి! తొవ్వలేమైనా పిడుగుపడితే నీళ్లురావు.. ఏంగావాలె కోటిమంది ఉండే హైదరాబాద్ గతి? చంద్రబాబు నా ముద్ర ఉన్నదంటడు. కాంగ్రెసోడు మేమే చేసినమంటడు. ఆనాడు నిజాం కట్టిన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ తప్ప దీనికి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉందా? ఈరోజు మనం 40 టీఎంసీల రిజార్వాయర్లు కట్టుకుంటున్నం. హైదరాబాద్కు ఏదేమైనా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కట్టుకుంటున్నం.
ఏం చేసినా తెలంగాణ సర్కారు చేయాల్సిందే కాంగ్రెస్, టీడీపీ పరిపాలనలో హైదరాబాద్లో నాలాలన్నీ కబ్జాలు పెట్టినారు. వానపడితే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు. ముఖ్యమంత్రి ఇంటి ముందర, అసెంబ్లీ ముందర, గవర్నర్ ఉండే రాజ్భవన్ముందల నీళ్లు. ఎవరి పుణ్యమండీ ఇదీ? చంద్రబాబు నా ముద్ర అంటడు. ఇగో ఇదే ఆ ముద్ర! తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఢిల్లీకెల్లి దోస్తొకాయన వచ్చిండు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండే ఆనాడు. ఇంటికిపోతుంటే పెద్ద వర్షం పడి.. కారు మునిగిపోయేటన్ని నీళ్లు. ఏమయ్యా చంద్రబాబు ముఖ్యమంత్రి కదా.. మాట్లాడితే హైటెక్కంటడు.. హైటెక్కు ప్లాన్ సిటీల గిట్లుందేందని అడిగిండు. నేను చెప్పిన.. హైదరాబాద్ల మాకు స్పెషల్కార్లున్నయి. వానపడంగనే మాకార్లు పడవలయిపోతయి అని చెప్పిన.
హైదరాబాద్లో వానకాలంల పేదల ఇండ్లల్లకు, బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టాల్సిన సొమ్ము రూ.11వేల కోట్లు. సిటీలో శుభ్రమైన మంచినీళ్లు రావాలంటే 12వేల కోట్లు ఖర్చుపెట్టాలె. 25నుంచి30వేల కోట్లు ఖర్చుపెడితే తప్ప నగరం బాగుపడే పరిస్థితి లేదు. దీన్ని చెయ్యాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలె. పక్క రాష్ట్రం సీఎం ఇక్కడ ఏం చెయ్యలేడు. కేసీఆర్గానీ, టీఆర్ఎస్గానీ వందకు వందశాతం పట్టిన పట్టువిడవకుండా పని చేసే పార్టీ. తెలంగాణ తెస్తమని.. తెచ్చిన పార్టీ. డబుల్బెడ్రూం ఇస్తమని, ఇచ్చిన పార్టీ. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న పార్టీ. కల్యాణలక్ష్మీ పెట్టి పేద ఆడబిడ్దలకు ఆదుకుంటున్న పార్టీ. ఏదో ప్రచార హోరులో కొట్టుకుపోయి.. అలవోకగా ఓటేసి ఆగమాగం కావొద్దు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ మీద కచ్చితంగా గులాబీజెండానే ఎగురెయ్యాలె. మీరంతా దానికి సమాయాత్తం కావాలె.
వదినమ్మ భువనేశ్వరి ఓటు మనకే.. చంద్రబాబు వదలగాక వదల అంటున్నడు. వదల బొమ్మాళీ వదల అంటున్నడు! నిన్ను ఎవడు పొమ్మన్నడు? నాకు అర్థంకాక అడుగుత! అంత నీకు ఇష్టం ఉంటే.. పెడతామంటే ఇంకో 15, 20 హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో. నీకు లైసెన్సు, మడిగ ఇప్పిస్తం. ఆయన విజయవాడల ఉంటండు. ఆయన భార్య భువనేశ్వరి.. మా వదన! ఈయన వ్యాపారాలంతా మా వదినే చూస్తరు. ఈయనకంటే ఆమెనే నయం! పదిహేను రోజులొకసారి రా.. ఇసాబ్ కితాబ్ చూసుకొని పో! ఎవలు వద్దంటరు నిన్ను? నేను గ్యారెంటీగా చెప్తున్నా! భువనేశ్వరి.. ఆమె ఇక్కడే ఉన్నరు.. నిజాయతీ ఉంది కాబట్టి.. నిన్న కార్యకర్తలు పోయి అడిగితే నేను కూడా హైదరాబాద్ల మీకే ఓటేస్తానని చెప్పింది. ఆమెకన్నీ తెలుసు. అందుకే వదినమ్మ మనకే ఓటేస్తది. నువ్వు ఇక్కడ ఉంటలేవు.. నీకు వాస్తవాలు తెల్వక ఇవన్నీ మాట్లాడుతున్నవు.
నేను అమరావతిల ఉంటనంటే నడుస్తదా? ప్రజలు చంద్రబాబూ నువ్వు ఆంధ్రప్రదేశ్లో పనిచేయి అని చెప్పిన్ను. కేసీఆర్ నువ్విక్కడ పనిచేయమని నాకు చెప్పిండ్రు. నీకు అప్పజెప్పిన పని నువ్వు జెయ్యాలె. నాకు అప్పజెప్పిన పని నేను జెయ్యాలె. నేను అమరావతికి వచ్చి నేను ఈడ్నే ఉంటా అంటే నడుస్తదా? ఒక ఊరు పటేలు.. ఇంకో ఊర్లో మస్కూరీ అంటరు. లేని పంచాయితీ ఎందుకు? మళ్ల విజయవాడలో చెప్తడు. నాకు హైదరాబాద్లో ఉండబుద్ధయితలేదు.. హైదరాబాద్నుంచి పాలన అంటే విదేశాల నుంచి చేస్తున్నట్లుందని అంటడు. మంచినీళ్లంటే రానీయవంటవ్. కృష్ణకెళ్లి, గోదావరికెళ్లి నీళ్లు తెస్తమంటే పంచాయితీ పెడ్తవ్. ఇపుడు ఎలక్షన్లు వచ్చినపుడు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతవా! గంత తెలివిలేకుండా ఉన్నమా మేము తెలంగాణల! నీ మాయమాటలు చాలిచ్చుకో చంద్రబాబు.. నీ పని నువ్వు చేసుకో! మా పని మేం జేస్కుంటం.
అవినీతిరహితంతోనే నాకు తృప్తి… నాకు నిజంగా తృప్తి కలిగేది ఎప్పుడంటే.. జంటనగరాలలో జీహెచ్ఎంసీ ఆఫీసులో పేద, మధ్యతరగతి ప్రజలు లంచం ఇయ్యకుండా పర్మిషన్ తెచ్చుకునే రోజులు రావాలె. ఆ స్టేజీ మీదున్న బిడ్డలు (పక్కనే ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్న టీఆర్ఎస్ అభ్యర్థులనుద్దేశించి) మీరు ప్రజలకు అభివాదం చేసి చెప్పాలె. పైస లంచం లేకుండా పర్మిషన్లు ఈ బిడ్డలతో చేయించే బాధ్యత నాది. వాళ్లు ప్రతిజ్ఞ చేస్తున్నరు. వందశాతం అవినీతి లేని, ప్రజల మధ్యన తిరుగాడే పాలన అందిస్తాం. మన రాష్ర్టాన్ని, నగరాన్ని అన్ని విధాలుగా తీర్చి దిద్దుకుంటాం. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నాకు చెప్పిండ్రు.. వాళ్లు అన్ని సమస్యలు ఆకళింపు చేసుకున్నరు కాబట్టి.. ఆ ప్రకారం ముందుకుపోదాం.
కేటీఆర్ చేతిలో మున్సిపాలిటీ శాఖ… కేటీఆర్.. నా కొడుకు. పంచాయతీరాజ్ మినిస్టర్. హైదరాబాద్ ప్రచారం భుజాల మీద వేసుకొని గల్లీగల్లీ తిరిగిండు. నా దగ్గరున్న మున్సిపల్ శాఖను ఆ పిల్లోనికి ఇచ్చి హైదరాబాద్ను అతని చేతిలో పెడతా. హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తం.
సీఎం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా -మంత్రి కే తారక రామారావు మున్సిపల్ శాఖ బాధ్యతను తనకి ఇస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేసిన ప్రకటనను సవినయంగా స్వీకరిస్తానని మంత్రి కే తారకరామారావు తెలిపారు. తనపై గురుతర బాధ్యత ఉంచినందుకు ముఖ్యమంత్రికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో పెరిగిన పౌరుడిగా తనమీద ఈ శాఖ మరింత బాధ్యతను పెంచుతుందని మంత్రి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత మూడునెలల కాలంలో నగరంలో విస్తృతంగా పర్యటించిన తనకు నగర ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలిశాయని వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఐటీశాఖ మంత్రిగా వివిధ వర్గాల ప్రజలతో ఇన్నాళ్లు నగరాన్ని దగ్గరి నుంచి చూశానని, ఇప్పుడు ప్రజలతో కలిసి తిరిగినప్పుడు వారి అవసరాలు సైతం తెలిశాయని అన్నారు. వాటన్నింటిని టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టామన్నారు. టీఆర్ఎస్ ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని తూచా తప్పకుండా అమలయ్యేలా తాను బాధ్యత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడం, నగరాలు, పట్టణాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెం దేలా చేయడమే తన ప్రాధాన్యతలుగా ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఓ విశ్వనగరంగా మార్చే తమ ప్రయత్నానికి మద్దతునిస్తూ నగర ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని కేటీఆర్ కోరారు.
ఈ సంక్షేమం.. తెలంగాణ వచ్చిన ఫలితం తెలంగాణ ఉద్యమం జరిగేనాడు ఒకటే హామీ ఇచ్చిన. మనరాష్ట్రం మనకొస్తే.. మన ఆదాయం మన సంక్షేమానికి, అభివృద్ధికే ఖర్చయితదని ఆనాడు చెప్పిన. నేను చెప్పిందియ్యాల అక్షరాలా నిజమయ్యింది. తెలంగాణలో ఇయ్యాల మనం వెయ్యి రూపాయల పింఛను ఇచ్చుకోగలుగుతున్నం. ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చినం కాబట్టి మన డబ్బులు మనకే మిగులుతున్నయి. మన పేదలు, వృద్ధులు, వికలాంగులకు పదిహేను వందలు, వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటున్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనిషికి నాలుగు కిలోల బియ్యమిస్తే ఈరోజు ఆరు కిలోల బియ్యం ఇచ్చుకుంటున్నం.
తెలంగాణ వచ్చిన ఫలితమిది. ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినం. ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు భారమైతదని చెప్పి ఇవాళ 51వేల రూపాయలు వారికి ఇవ్వడానికి స్కీం పెట్టుకున్నం. షాదీముబారక్ పెట్టుకున్నం. 51వేల రూపాయలిస్తున్నం. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు సన్నబియ్యం ఇచ్చుకుంటున్నం. అన్నింటికీ మించి పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పిన. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకుంటున్నం. ఈ డబుల్బెడ్రూం ఇండ్ల పథకం రేపు హైదరాబాద్ నగరంలో ఉన్న పేదలందరికీ కూడా ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్గా.. మీ బిడ్డగా.. ఈ మాట మీకు మనవి చేస్తున్నా. తెలంగాణ మనం తెచ్చుకున్నం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నయి.
తెలంగాణ జిగేల్మంటున్నది.. తెలంగాణ వచ్చే నాటికి కిరణ్కుమార్రెడ్డి అనే ఒకాయన ముఖ్యమంత్రి ఉండె. తెలంగాణ వస్తే చిమ్మ చీకటైతది.. కరెంటే ఉండదు.. మీరు అంధకారమయం అయిపోతరని కట్టె పట్టుకుని మాట్లాడినరు. ఇయాల పరేడ్గ్రౌండ్ చూస్తే జిగేల్మని వెలుగులతో తెలంగాణ వెలిగిపోతున్నది. కోతల్లేని కరెంటు అందిస్తున్నం. ఆనాడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినారో అవన్నీ తప్పులని ఈనాడు తేలినయి. ఆనాడు ఇందిరాపార్క్వద్ద పరిశ్రమలవాళ్లు వచ్చి మాకు కరెంటియ్యమని చెప్పి ధర్నా చేసినారు. ఇప్పుడు కోత లేకుండా 24 గంటలు కరెంటివ్వగలుతున్నం.
చెట్టపట్టాలేసుకుంటూ అభివృద్ధి పథం హైదరాబాద్ ప్రజలు, మేధావులు ఒక విషయం ఆలోచన చేయాలె. చంద్రబాబు నాయుడొచ్చి ఈడ మీకు చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నడు. ఆయన చేతిల నెత్తి ఉన్నదా.. కత్తి ఉన్నదా! ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయలేడు. మీ ఆశీర్వాదం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నది, పాలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. బల్దియాలో కూడా గులాబీ జెండా ఎగిరితే అభ్యర్థులంతా గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ.. రెండూ చెట్టాపట్టాలేసుకొని పనిచేస్తే.. బ్రహ్మాండమైన నగరాన్ని చేయగలుగుతం.
విశ్వనగరం నా కల… ఫైనల్గా ప్రజలకు మనవి ఒక్కటే. యావన్మంది తెలంగాణమంత్రులు, ఎమ్మెల్యేలు మీ గల్లీ గల్లీ తిరిగిండ్రు. మీ సమస్యలు చూసిండ్రు. మేం అందరం చెప్తున్నం. నేను కంటున్నది ఒకటే కల. ఆ కల నిజం చేసి తీరుతా అని చెప్తున్న. హైదరాబాద్ విశ్వనగరం కావాలె. అద్భుతమైన పట్టణం కావాలె. అమెరికాలో డల్లాస్కంటే కూడా గొప్ప నగరంగావాలె. కేసీఆర్ మొండోడు.. మీకు తెలుసు. ప్రాణం పోయినా సరే హైదరాబాద్ జంటనగరాలను బ్రహ్మాండంగా చేస్తా.
చంద్రబాబు వదల బొమ్మాళీ అంటున్నడు.. చంద్రబాబు హైదరాబాద్ను వదలగాక వదల అంటున్నడు. వదల బొమ్మాళీ వదల అంటున్నడు.. నిన్ను ఎవడు పొమ్మున్నరు నాకు అర్థంకాక అడుగుత. అంత నీకు ఇష్టం ఉంటే.. పెడతామంటే ఇంకో పదిహేను, ఇరవై హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో. నీకు లైసెన్సు, మడిగ ఇప్పిస్తం. ఆయన విజయవాడల ఉంటండు. ఆయన భార్య భువనేశ్వరి.. మా వదిన. ఈయన వ్యాపారాలంతా మా వదినే చూస్తరు. ఈయన కంటే ఆమెనే నయం. పదిహేను రోజులకొకసారి రా… ఇసాబ్ కితాబ్ చూసుకొని పో. ఎవరు వద్దంటరు నిన్ను? నేను గ్యారెంటీగా చెప్తున్నా.. భువనేశ్వరి ఇక్కడే ఉన్నరు, నిజాయితీ ఉంది కాబట్టి.. నిన్న కార్యకర్తలు పోయి అడిగితే నేను కూడా హైదరాబాద్ల మీకే ఓటేస్తానని చెప్పింది. ఆమెకన్నీ తెలుసు.. అందుకే గ్యారెంటీగా వదినమ్మ మనకే ఓటేస్తది. నువ్వు ఇక్కడ ఉంటలేవు.. నీకు వాస్తవాలు తెల్వక ఇవన్నీ మాట్లాడుతున్నవు.
నారాయణ మీద రంది.. సీపీఐ నారాయణ నాకు మంచి దోస్తు. నిన్నటి నుంచి నాకు పెద్ద రంది పట్టుకున్నది. టీఆర్ఎస్ సొంతంగా జీహెచ్ఎంసీ మీద గెలిస్తే నా చెవు కోసుకుంటా అన్నరు. నారాయణా.. ఐదో తారీఖునాడు హైదరాబాద్ల ఉండకు సుమా. ఎందుకంటే ఎవలన్నా పట్టి చెవికోస్తే.. నిన్ను దావఖాన్ల పెట్టి ట్రీట్మెంట్ చేయించాలె.

