-స్టార్టప్ ఇండియా విభాగంలో స్కోచ్ అవార్డుకు మంత్రి ఎంపిక -టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినందుకే -ఈ నెల 19న ఢిల్లీలో అవార్డుల ప్రదానం -స్టార్టప్ల అభివృద్ధి పై కేటీఆర్ ప్రసంగం
వినూత్న పద్ధతులతో పాలనలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మునిసిపల్శాఖల మంత్రి కే తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. టెక్నాలజీ వినియోగం, పరిపాలన, పారదర్శకతలను సమన్వయం చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న మంత్రి కేటీఆర్ను స్కోచ్ సంస్థ ఈ ఏడాది చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. టీ హబ్ వంటి వినూత్న ప్రాజెక్టులు చేపట్టి టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి.. నూతన భారతదేశ ఆవిష్కరణ కోసం పని చేస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు స్కోచ్ సంస్థ తెలిపింది. తాను ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గత 14 ఏండ్లుగా దేశంలోని ప్రముఖులను గుర్తిస్తున్న స్కోచ్ అవార్డులు ప్రదానం చేస్తున్నది. స్టార్టప్ ఇండియా విభాగంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్కు చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బహూకరించనున్నట్లు స్కోచ్ సంస్థ బుధవారం తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో ఐటీ రంగంలో ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకున్నామని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్ టీ హబ్ ఏర్పాటుచేయడం అభినందనీయమని పేర్కొంది.
టీ హబ్ ద్వారా స్టార్టప్లకు చేయూతనందించడంలో మంత్రి కేటీఆర్ ముందు వరుసలో నిలిచారని తెలిపింది. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి, ఈ అవార్డును స్వీకరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించిన స్కోచ్ సంస్థ, స్టార్టప్లు, వాటికి ఇవ్వాల్సిన మద్దతు అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ గవర్నర్ ఆర్ రంగరాజన్, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్పరేఖ్, ఆర్థిక నిపుణుడు విజయ్కేల్కర్ తదితరులు వక్తలుగా పాల్గొంటారు.

