-1956 నాటి పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం -చంద్రబాబు నరనరానా తెలంగాణ వ్యతిరేకతే -తెలంగాణలో ఆయన అడ్డుకోనిది ఏమున్నది? -హైకోర్టు విభజనకు మోకాలడ్డింది ఎవరు? -కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోలేదా? -రాత్రికిరాత్రే పీపీఏలను రద్దుచేయడం నిజంకాదా? -కోదండరాంను కోదండమెక్కించారు -కాంగ్రెస్లో ఉన్నవారంతా తెలంగాణ వద్దన్నవారే -కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి: మంత్రి హరీశ్రావు
కూటమి నేతల కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడిందని, 1956 నాటి పరిస్థితి పునరావృతమయ్యే ముప్పు పొంచి ఉన్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని, అప్పట్లో కమ్యూనిస్టులను ఎదుర్కోలేక అధికారం కోసం కుటిలత్వంతో కాంగ్రెస్ ఈ పనిచేసిందని తెలిపారు. ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మళ్లీ నాటి పరిస్థితికి తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రలను పసిగట్టి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ద్రోహులకు తెలంగాణలో స్థానంలేదని, కూటమిని చిత్తుగా ఓడించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు దండె విఠల్, శ్రీనివాస్రెడ్డితో కలిసి సోమవారం తెలంగాణభవన్లో మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారని విమ్శంచారు.
ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన చంద్రబాబు.. 2014లో ఏపీ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తెలుగు ప్రజలను తిరిగి కలుపగలిగే శక్తి టీడీపీకి ఉందని చెప్పడాన్ని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగానే కూటమిలో కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబు మళ్లీ సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకొంటారని అన్నారు. చంద్రబాబు అడ్డుకోకుంటే 18 ఏండ్ల క్రితమే తెలంగాణ వచ్చేదన్నారు. ఆ విషయాన్నినాటి ఉపప్రధాని అద్వానీ చెప్పటాన్ని హరీశ్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకొనేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో మనకు తెలియదా? హైకోర్టు విభజనను అడ్డుకొన్నది ఆయన కాదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా చేయాలని కేంద్రానికి లేఖలు రాయడం నిజంకాదా? సీతారామ, పాలమూరు ప్రాజక్టులకు అనుమతులను అడ్డుకొన్నది, రాత్రికిరాత్రే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దుచేసింది చంద్రబాబు కాదా? తెలంగాణలో ఆయన అడ్డుకోనిది ఏంది? మీడియా మేనేజ్మెంట్ చేసినంతమాత్రాన నిజాలు మారిపోతాయా? ప్రజలు మరిచిపోతారా? అని హరీశ్ ప్రశ్నలవర్షం కురిపించారు. ఇవి రాష్ట్రం కోసం 14 ఏండ్లు పోరాడిన కార్యకర్తగా, కేసీఆర్ నాయకత్వంలో జైలుకెళ్లిన ఉద్యమకారుడిగా తెలంగాణను కాపాడుకొనేందుకు పక్కా ఆధారాలతో మాట్లాడుతున్న మాటలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగంచేసినవారు ఒకవైపు, తెలంగాణకు అడ్డుపడ్డవారు మరోవైపు ఉన్నారన్న హరీశ్.. రాష్ట్రం ఎవరిచేతిలో ఉంటే బాగుంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో ఎవరు పోటీచేయాలి? ఎవరి మధ్య పోటీ జరగాలి? మన ఎన్నికల్లో ఎవరు ప్రచారంచేయాలి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? పాలనను ఇంకెవరికో అప్పగించాలా? అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.
కోదండరాంను కోదండమెక్కించారు.. కూటమిలో సీపీఐని కార్నర్చేసి ఓ మూలన కూర్చోబెట్టారని, టీజేఎస్ అధినేత కోదండరాంను కోదండం ఎక్కించడంతో ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని మంత్రి హరీశ్ ఎద్దేవాచేశారు. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ గ్రామాల్లో తిరిగి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసులు వేయించేందుకు తమను వాడుకొన్న కోదండరాం.. చివరికి తమను వదిలేశారని న్యాయవాది రచనారెడ్డి వాపోయినట్టు పత్రికల్లో చూశానని తెలిపారు. అధికారం కోసం దేనికైనా దిగజారడం కాంగ్రెస్ నైజమని మంత్రి హరీశ్ విమర్శించారు. ఆ పార్టీ నేతలు చంద్రబాబు ట్రాప్లో పడ్డారని, చంద్రబాబు ఎప్పుడు తెలంగాణను కబ్జాపెడుదామని గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన రాగానే రాత్రికి రాత్రే టీడీపీ ఎమ్మెల్యేలతో బాబు రాజీనామా చేయించిన విషయాన్ని హరీశ్ గుర్తుచేశారు. తెలంగాణ పట్ల చంద్రబాబు అణువణువునా వ్యతిరేకత నింపుకొన్నారని చెప్పారు. 2012 డిసెంబర్ 30న మీ కోసం యాత్రలో వరంగల్ జిల్లా టేకుమట్లకు వెళ్లిన చంద్రబాబుకు అక్కడి మహిళలు జై తెలంగాణ అని రాసిన బోనాన్ని ఇస్తే ఆయన దాన్ని వెనక్కి ఇచ్చేసి జై తెలుగుదేశం అని రాయించుకొన్న బోనాన్ని ఎత్తుకొన్నారని గుర్తుచేశారు. పథకం ప్రకారం చంద్రబాబు తొలుత తన కోవర్టులను కాంగ్రెస్లోకి పంపి ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ కండువా వేసుకొన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం, కూకట్పల్లిలో మాత్రమే తిరుగుతున్న చంద్రబాబు.. వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఎందుకు వెళ్లడంలేదని హరీశ్ నిలదీశారు.
రాహుల్.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి -హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంప పెట్టులాంటిది -పాలమూరు ప్రాజెక్టులపై బాబు రాసిన లేఖ వాపస్ తీసుకోవాలి: మంత్రి టీ హరీశ్ రావు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. హైకోర్టు తీర్పు తరువాతనైనా కాంగ్రెస్ నాయకులకు కనువిప్పు కలుగాలని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులపై రాహుల్గాంధీ అనవసరంగా చేసిన ఆరోపణలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పథకం ప్రకారం రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న దని విమర్శించారు. న్యాయవాది రచనారెడ్డి సైతం తన సేవలను వినియోగించుకొని కేసులు వేశారని చెప్పారని, ఈ విషయం తాను పత్రికల్లో చూశానని వివరించారు. కొల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్రెడ్డి గ్రీన్ ట్రిబ్యునల్లో, కుంభకోణం జరిగిందని నాగం జనార్దన్రెడ్డి కేసులు వేశారని పేర్కొన్నారు. ఆ కేసును వాదించడానికి న్యాయవాదులెవరూ ముందుకు రాలేదని, దీంతో తనే కేసు వాదించుకుంటానంటూ వెళ్లగా కోర్టు మొట్టికాయలు వేసి కొట్టివేసిందని వివరించారు. పాలమూరు ప్రాజెక్టు అడ్డుకోవడానికి లేఖ రాసింది చంద్రబాబు అయితే, ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కోర్టులో కేసులు వేసింది కాంగ్రెస్పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి అని విమర్శించారు. డైరెక్షన్ వేరని, ఇద్దరి ఎజెండా ఒక్కటేనని, ప్రాజెక్టులు కట్టొద్దు, అభివృద్ధి జరగొద్దనేదే వారి ఉద్దేశమన్నారు. తెలంగాణపై ఆయనకు ప్రేమ ఉంటే ఇప్పటికైనా పాలమూరు ఎత్తిపోతల మీద రాసిన ఉత్తరాన్ని వాపస్ తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి ఓటు అడగాలని డిమాండ్ చేశారు.
నాడు కాంగ్రెస్ నేతలు ఎవరేమన్నారంటే.. -బెర్లిన్ గోడను కూల్చి జర్మనీ ఒక్కటైనట్టుగా ఆంధ్రా,తెలంగాణ ఏకమవుతాయి. తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వను ఏమిచేసుకొంటారో చేసుకోండి: కిరణ్కుమార్రెడ్డి -సమైక్యరాష్ట్రంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నది జీవన్రెడ్డి -హస్తం గుర్తుకు ఓటేయకపోతే తెలంగాణను మళ్లీ ఆంధ్ర లో కలుపుతాం: బలరాంనాయక్ -తెలంగాణ ఇచ్చి తప్పుచేశామేమోనన్న అభిప్రాయం కలుగుతున్నది: జానారెడ్డి -సీఎం కేసీఆర్ను ఉరితీయాలి: సుధీర్రెడ్డి -అసలు ప్రత్యేక రాష్ర్టాన్నే ఇవ్వొద్దు. ఒకవేళ ఇస్తే సంగారెడ్డిని బీదర్లో కలుపాలి: జగ్గారెడ్డి -రాష్ర్టాలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం – చిన్నారెడ్డి -జాతీయవాదమే.. ప్రాంతీయవాదిని కాదు – జైపాల్రెడ్డి

