-ప్రతిపక్షాలకు అదొక రాజకీయ క్రీడ -టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ మీరే -కొత్తతరం నాయకులుగా ఎదుగండి -దశలవారీగా శిక్షణ ఇస్తాం -టీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ -టీఆర్ఎస్వీ సభ్యత్వ నమోదుపై ప్రశంసలు
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి ఒక టాస్క్ అయితే ప్రతిపక్షాలకు మాత్రం ఈ అంశం రాజకీయ క్రీడగా మారిందని టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే తెచ్చుకున్న తెలంగాణను బంగారు రాష్ట్రంగా మార్చుకుందామని అన్నారు. టీఆర్ఎస్వీ విద్యార్థులు పార్టీలో కొత్తతరం నాయకులుగా ఎదుగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి, టీఆర్ఎస్కు భవిష్యత్ మీరేనన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి వాటిని అధ్యయనం చేయాలని ఉద్బోధించారు. మంగళవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) రాష్ట్రకమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో తాము ముందుకుపోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని పట్టించుకోకుండా అధికార యావతో వ్యవహరిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి భవిష్యత్ మీరేనని, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని పార్టీలో ఎదుగాలని చెప్పారు.
విషయ పరిజ్ఞానం ఉన్నవారికి మంచి భవిష్యత్ ఉంటుందని, నేర్చుకోవాల్సింది సముద్రమంతా ఉందని, నిరంతరం అధ్యయనం చేయాలని అన్నారు. టీఆర్ఎస్వీ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేసినందుకు నాయకులను అభినందించారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు ఉన్న విద్యార్థి సంఘం మనదేనని, దీంతో మనపై బాధ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో, వాటి పరిష్కారంలో మీరు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. సమస్యల పట్ల స్పందించే తీరే మిమ్ములను బలమైన నాయకులుగా మారుస్తుందని తెలిపారు. దశలవారీగా అన్నిస్థాయిల వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని టీఆర్ఎస్వీ నాయకులకు సూచించారు. త్వరలో రాష్ట్ర కమిటీకి, జిల్లా కోఆర్డినేటర్లకు శిక్షణా శిబిరాలు, ఆ తరువాత దశల వారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శిక్షణా శిబిరాలకు తాను కూడా హాజరై తెలంగాణ చరిత్ర గురించి వివరిస్తానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా కొద్దిగా కష్టపడితే వంద సీట్లను సులువుగా గెలుచుకోవచ్చునన్నారు. ఇందుకు అందరూ కష్టపడి, నిబద్ధ్దతో పనిచేయాలని, గత పాలనకు ప్రస్తుత పాలనకు తేడా ఏమిటో ప్రజలకు వివరించాలని చెప్పారు.
ప్రాజెక్టులను అధ్యయనం చేయండి..
తెలంగాణ ప్రజల నీటి అవసరాలను తీర్చే కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించి వాటిని అధ్యయనం చేయాలని టీఆర్ఎస్వీ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల దగ్గరికి పోయి పరిశీలించండి.. మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఇన్టేక్ వెల్ అంటే ఏంది? ఇతర సాంకేతిక అంశాలేంది అనేది తెలుసుకోవాలె.. ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవాలె అని చెప్పారు. గోదావరి, కృష్ణానదుల నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని టీఆర్ఎస్వీ విద్యార్థులకు తెలిపారు.
రాష్ట్ర చరిత్రను తెలుసుకోండి..
భవిష్యత్లో పార్టీని నడిపించాల్సింది మీరే.. ఇక మీ తరమే ముందుకునడువాలి.. ఇందుకు చరిత్రపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం కేసీఆర్ వారితో చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాలను దాదాపుగా రెండు గంటలకు పైగా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో విద్యార్థులకు వివరించారు. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిషువారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎంతో గొప్పగా పొగుడుతారని, అయితే నిజానికి అంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలోనే ప్రాజెక్టులు ఎక్కువగా చేపట్టారని తెలిపారు. అనేక ప్రాజెక్టులను నిజాం హయాంలో పూర్తి చేశారన్నారు. కానీ ఆయన సమాధి వద్దకు వెళితే పెద్ద వివాదంగా చూపించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎదురైన పరిస్థితులు, అనుభవాలను, వాస్తవాలను కూడా విద్యార్థులకు తెలిపారు. ఉద్యమ సమయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలని చూశాడని, అనేక రకాలుగా ఇబ్బందులు, ఒత్తిళ్లకు గురి చేశాడని, ఆ విషయాలన్ని సీఎం గుర్తు చేశారు. ఆనాడు అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. ఉద్యమ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజా సమస్యలపై చేసిన అధ్యయనాలనే ఇతర పార్టీలు, సంఘాలు ఉపయోగించుకున్నాయని, శ్రీకృష్ణ కమిటీకి ఆ వివరాలనే అందించారని తెలిపారు. డిసెంబర్ 9న ప్రకటన మనం రాసిచ్చిందే చదివారని గుర్తు చేశారు.
ప్రతి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ సీటిస్తాం పార్టీపరంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్వీకి ప్రాధా న్యం ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇకపై రెండేండ్లకు ఒకసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును టీఆర్ఎస్వీ నాయకులకు కేటాయిస్తామని ప్రకటించారు. పునర్విభజన దరిమిలా అసెంబ్లీ సీట్ల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చిందని, సీట్లు పెరిగితే మూడు సీట్లు టీఆర్ఎస్వీ నాయకులకు ఇస్తామన్నారు. విద్యార్థి సుమన్కు ఎంపీగా అవకాశం వచ్చిందని, భవిష్యత్తులో మరికొందరికి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ సమన్వయకర్త, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, టీఎస్టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్కుమార్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శులు జోగినపల్లి సంతోష్కుమార్, ఎం శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, పీ రాములు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా సంతోష్కుమార్ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జోగినపల్లి సంతోష్కుమార్ మంగళవారం జరిగిన టీఆర్ఎస్వీ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలిసారిగా పార్టీ సమావేశానికి హాజరైన ఆయనను పార్టీ నాయకులు అభినందించారు. టీఆర్ఎస్ నాయకులు ఆసీసులైన సీట్లకు వెనుకవరుస కుర్చీలో కూర్చు ని కేసీఆర్ ప్రసంగాన్ని ఆయన ఆసక్తిగా విన్నారు.

