రాష్ట్రంలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 2005-06 తర్వాత రాష్ర్టానికి కొత్త పారిశ్రామిక పార్కులు రాలేదని గుర్తు చేశారు. దేశంలో అతిపెద్ద జౌళిపార్కును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే వివిధ పారిశ్రామిక పార్కులు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. డ్రైపోర్టు ఏర్పాటుపై దుబాయ్ పోర్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. డ్రైపోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై నిర్ణయం తీసుకోవాలన్నారు. చందన్వెల్లిలో టెక్స్టైల్స్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టేందుకు ముందుకు వచ్చారని స్పష్టం చేశారు. జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ ఏర్పాటుకు 190 ఎకరాలు కేటాయించామన్నారు. రాష్ట్రంలో అన్ని వైపులా ఐటీ విస్తరించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఇప్పటికే 15 ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు ఉన్నాయన్నారు. రహేజా మైండ్ స్పేస్లోనే 1.10 లక్షల మందికి ఐటీ ద్వారా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు.

