-తెలంగాణ ఆచరణ.. దేశం అనుసరణ.. భారత్ ముందుకు తెలంగాణ మాడల్
-సాకారమైన ఉద్యమ ట్యాగ్లైన్.. నీళ్లు, నిధులు, నియామకాలు సఫలం
-మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి.. ముమ్మాటికీ బీఆర్ఎస్దే అధికారం
-95 నుంచి 100 సీట్లు మావే: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-దేశానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే
-కాంగ్రెస్ చెప్తున్నది.. మేం చేసి చూపించినం
-ఉన్న 3 సీట్లు గెలవడమూ బీజేపీకి గగనమే
-75 ఏండ్ల పాలన.. 9 ఏండ్ల ప్రగతి చూడండి
-ఏ రంగంలో అయినా తెలంగాణే నంబర్ వన్
-గుడిసె నుంచి గూగుల్ దాకా దూసుకెళ్తున్నది
-దక్షిణాది రాష్ట్రాల గొంతు నులిమేందుకు కుట్ర
-ఉత్తరాదికి నిధులు ఇస్తే ఎప్పుడూ వద్దనలేదు..
-తెలంగాణకు ఇవ్వలేదనే ప్రశ్నించినం: కేటీఆర్
రూ.200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ కావాలా? రూ.2,000 పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ కావాలా? 55 ఏండ్లు అధికారం ఇస్తే కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ కావాలా? 24 గంటలూ నాణ్యమైన కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా? రాబందుల్లా పీక్కుతిన్న కాంగ్రెస్ కావాలా? రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి. దశాబ్దాలపాటు పరిపాలించినా ప్రజలకు ఏం చేశారో చెప్పలేని దుస్థితి కాంగ్రెస్ది. అదే బీఆర్ఎస్ తన 9 ఏండ్ల పాలనలో ఏం చేసిందో చెప్తున్నది. బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు ఉన్న తేడా అదే. తెలంగాణ నమూనా అర్థం కావాలంటే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ తరహా పరిపాలన ఉన్నదా లేదా? అని చూడాలి. తెలంగాణ మాడల్ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉన్నదా? మేం పరిపాలించింది 9 ఏండ్లే. కానీ, వాళ్లు 75 ఏండ్లు చేయలేని పనులను కూడా మేం 9 ఏండ్లల్లో చేసి చూపెట్టాం. మళ్లీ మీకు అదే దుష్పరిపాలన.. దుష్ఫలితాలు కావాలా? అలోచించండి.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలో నిర్మించాం. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాత్రం సీతాఫల్మండిలో లిఫ్టును ప్రారంభించారు. ప్రధాని మోదీ ఒకే రైలును మళ్లీమళ్లీ ప్రారంభిస్తున్నారు. కేంద్ర మంత్రులు రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, టాయిలెట్లను ప్రారంభిస్తున్నారు. బీఆర్ఎస్కు, బీజేపీకి మధ్య తేడాకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేముంటది.
-మంత్రి కేటీఆర్
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తేల్చి చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 100 సీట్లు వస్తాయని తెలిపారు. 75 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయో, తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో పరిశీలించాలని ప్రజలను కోరారు. ‘మేం పరిపాలించింది కేవలం 9 ఏండ్లే. కానీ, వాళ్లు 75 ఏండ్లు చేయలేని పనులను కూడా మేం ఈ 9 ఏండ్లలో చేసి చూపెట్టాం. మళ్లీ మీకు అదే దుష్పరిపాలన.. దుష్ఫలితాలు కావాలా? అలోచించండి’ అని సూచించారు. ‘తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలు మళ్లీ ఒకసారి నిండు మనసుతో కేసీఆర్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని తనదైన శైలిలో ఆవిష్కరిస్తూనే కాంగ్రెస్, బీజేపీపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ‘తెలంగాణను సాధించింది మేమేనని బీఆర్ఎస్ చెప్పింది. కాదు మేమే ఇచ్చామని కాంగ్రెస్ చెప్పింది. ప్రజలు ఎవరిని విశ్వసించారు? రెండుసార్లు కాంగ్రెస్ను చెత్తబుట్టలో పడేసి, బీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాకంటే ఎక్కువ అభివృద్ధి చేశామని కాంగ్రెస్ నాయకుడు ఎవరైనా బహిరంగంగా చెప్పగలరా?’ అని సవాల్ విసిరారు.
దేశంలో చాలామందికి మీడియాతో మాట్లాడే ధైర్యమే లేదు. మీడియాను చూసి కేంద్ర మంత్రులు పారిపోతున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటది.
తెలివితో ఆలోచించండి
దేశంలో నాలుగు రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని, ఎక్కడైనా తమకంటే మెరుగైన పాలన అందిస్తున్నదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసని, పండిన పంటను కొనే పరిస్థితి కూడా లేదని తెలిపారు. ఛత్తీస్గఢ్లో ఎకరాకు 12 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనాలని అక్కడి ప్రభుత్వం సీలింగ్ విధించిందని, తెలంగాణలో ఆ పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. 65 లక్షల మంది ఖాతాల్లో రూ.65 వేల కోట్లు వేశామని, 75 ఏండ్లలో ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ ఈ పని చేసిందా? అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 100 సీట్లు రావడం ఖాయమని తెలిపారు.
రాజకీయాల్లో పోరాటాలు, కొట్లాటలు సమ ఉజ్జీలతోనే ఉంటాయి. మరుగుజ్జులతో కాదు. తెలంగాణలో బీఆర్ఎస్తో పోటీపడే స్థితిలో కాంగ్రెస్ లేదు. రాష్ట్రంలో బీజేపీ అసలే లేదు. మత ప్రాతిపదికన ప్రజలు ఓట్లు వేస్తారని బీజేపీ ఆశిస్తే అది భ్రమే అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీనే కాదు.. చివరికి కేఏ పాల్, షర్మిల, ప్రవీణ్ సైతం అధికారంలోకి వస్తామని చెప్తున్నారు.
– మంత్రి కేటీఆర్
ఏ రంగంలోనైనా నంబర్ వన్
సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధిని తెలంగాణ సాధించిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ప్రగతిని తెలంగాణ సాధించిందని పేర్కొన్నారు. అభివృద్ధి సూచికల్లో విద్య, వైద్యం ప్రధానమైనవని, వైద్యారోగ్యంలో 9 ఏండ్ల కింద 24వ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు నీతి అయోగ్ చెప్పిన లెక్కల ప్రకారమే మూడో స్థానానికి చేరుకొన్నదని వెల్లడించారు. పల్లె, బస్తీ దవాఖానాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ వంటి అనేక అంశాలు ఇందుకు తోడ్పడ్డాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 69 శాతానికి పెరిగాయని తెలిపారు. ‘మన ఊరు-మన బడితో 26 వేల స్కూళ్లను బాగుచేసుకొంటున్నాం. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల దాకా నాణ్యమైన విద్యను అందివ్వటం ద్వారా విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. నాసా నుంచి ఆహ్వానం వచ్చింది.. వెళ్లటానికి సహకారం అందించండి అని మహేశ్వరం మాడల్ స్కూల్ పిల్లలు చెప్తుంటే సంతోషమేసింది. అలాగే నీట్, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తూ గురుకులాల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు’ అని సంతోషం వ్యక్తంచేశారు.
దేశంలో 1,001 గురుకుల పాఠశాలలున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. గురుకులాల్లో 6 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.1.25 లక్షలు ఖర్చుచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
త్రీ ఐ మంత్ర
ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే త్రీ ఐ మంత్రను తాము ఆచరించి చూపామని, ఫలితంగా తెలంగాణ సమతుల్యమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో 7.7 శాతం గ్రీన్ కవర్ను పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, 24 వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడం ద్వారా పర్యావరణ హితంగా కొత్త ఉపాధి కల్పనా అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యుత్తు స్థాపిత సామర్థ్యాన్ని 7 వేల మెగావాట్ల నుంచి 24 వేల మెగావాట్లకు పెంచుకొన్నామని తెలిపారు.
దేశంలో 3 శాతంకన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణ.. 30 శాతం పంచాయతీ అవార్డులను సాధించింది. మున్సిపాలిటీల్లో అత్యధిక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డలను పొందిన రెండో రాష్ట్రం తెలంగాణ. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో దేశంలో తెలంగాణ నంబర్ 2.
– మంత్రి కేటీఆర్
అభివృద్ధి.. సంక్షేమంలో సమతుల్యత
అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యతను సాధించామని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సమతుల్యత సాధించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల సంక్షేమంలోనూ సమతుల్యతను తెలంగాణ సాధించిందని తెలిపారు. బతుకమ్మ చీర పెట్టినా.. రంజాన్కు తోఫా ఇచ్చినా తెలంగాణకు సాటి మరే రాష్ట్రం లేదని పేర్కొన్నారు. వైవిధ్యమైన అభివృద్ధి తెలంగాణలో తప్ప మరో రాష్ట్రంలో ఉండదని అన్నారు. ‘దేశంలో గ్రీన్ బడ్జెట్ను ప్రవేశట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఆవిష్కరణ అంటే సాంకేతికత మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సరికొత్త ఆవిష్కరణలు చేశాం’ అని ఆయన ఉదహరించారు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు తెచ్చామని చెప్పారు.
పసలేని ప్రతిపక్షాలు
రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు పనిలేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలవి పనికిమాలిన ఆరోపణలని కొట్టిపారేశారు. గతంలో ఎండాకాలంలో నీళ్ల కోసం యుద్ధాలు, కరెంట్ కోసం సిగపట్లు ఉండేవని, వాటిని లేకుండా చేశామని తెలిపారు. గత ఏడాదికంటే ఈ సంవత్సరం 12 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువ కొన్నామని, పుష్కలమైన నీళ్లు ఉండటం వల్ల పంటలు అద్భుతంగా పండాయని పేర్కొన్నారు. వాస్తవాలను విస్మరించి విపక్షాలు వడ్లు ఇంకా తరలించటం లేదని ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలవి పిచ్చికూతలని ధ్వజమెత్తారు.
ప్రతీ పనిలో లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాయి. కేంద్రంలో 9 ఏండ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అదేపనిగా గొంతు చించుకొని ఆరోపణలు చేయ టం మినహా చేసిందేమీ లేదు. నిరాధారమైన ఆరోపణలు చేయటమే తప్ప తెలంగాణ ఫలానా రంగంలో, ఫలానా అంశంలో అన్యాయం చేసిందని ఆధా ర సహితంగా, హేతుబద్ధంగా నిరూపించిన దాఖలాలున్నాయా?
బీఆర్ఎస్కే అధికారమివ్వండి
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త అభివృద్ధి మాడల్ను దేశానికి అందించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘జేబులో ఉన్న రూపాయిని పారేసి రోడ్డు మీద చిల్లరను ఎవరూ ఏరుకోరు. సరుకున్న, సబ్జెక్ట్ ఉన్న లీడర్.. దమ్ము, దక్షత, సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ రూపంలో రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.అంత అద్భుతమైన నాయకుడు మనకు ఉండగా.. ఎవరో కారు కూతలు, పెడబొబ్బలు, వీధుల్లో ఆర్తనాదాలు చేసినంత మాత్రాన కిందా మీడాల్సిన అవసరంకానీ, పట్టించుకోవాల్సిన పనికానీ లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ర్టానికి దశాబ్దం నిండుతున్న సందర్భంగా నిండు మనసుతో మళ్లీ ఒకసారి కేసీఆర్ నాయకత్వానికి, బీఆర్ఎస్కు అధికారమిచ్చి ఆశీర్వదించండి’ అని ప్రజలను కోరారు.
ఉన్న మూడూ దక్కవు
కులాలు, మతాలను చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని, మెరుగైన పాలన అందించగలిగే ప్రభుత్వంవైపే ప్రజలు ఉంటారని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర బీజేపీ భ్రమల్లో బతుకుతున్నదని ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 3 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఉండరేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. ఈ దేశంలో ఇప్పటి వరకు మోదీ వంటి అసమర్థ, చేతకాని, దద్దమ్మ, అప్రభావిత ప్రధాని మరొకరు లేరని విమర్శించారు.
సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది నా వాదన కాదు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ర్టాలు నష్టపోకూడదన్నదే నా వాదన. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ర్టాలకు సమానమైన అవకాశాలు ఉండాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ర్టాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండనున్నాయి. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన రాష్ర్టాలు నష్టపోకూడదు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరు. ఇప్పటినుంచే లోక్సభ స్థానాల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది.
– మంత్రి కేటీఆర్
రూ. 1,000 కోట్లతో నాలాల ఆధునీకరణ
హైదరాబాద్లో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజా రవాణాను మెరుగుపర్చినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంకా చేయాల్సిన పనులున్నాయని తెలిపారు. మెట్రోరైల్ లైన్ 200 నుంచి 250 కిలోమీటర్లకు పెంచాల్సి ఉన్నదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నాలాల అభివృద్ధి, మురుగునీటి నిర్వహణ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
మాకు కావల్సినంత సరుకున్నది
తాము చేసిన పనిని చెప్పుకోవడానికి కావల్సినంత సరుకు ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. విపక్షాలకు ఏమున్నదని ప్రశ్నించారు. రేపట్నుంచి తామూ మొదలుపెడతామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజులు ఒక్కో పని గురించి చెబుతామని పేర్కొన్నారు. అవసరమైతే ఎన్నికలు వచ్చేంత వరకూ తాము చేసిన పని చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొంటే దినం మొత్తం మేము, మా కార్యకర్తలు, మా సైన్యం మాట్లాడుతుంది. 9 ఏండ్ల బీజేపీ పాలనలో చేసిన ఒక్క మంచి పని గురించి చెప్పమనండి. మేము మొదలుపెట్టిన అన్ని మంచి పనులను మొదట అందరూ వ్యతిరేకించినవారే. ఇప్పుడు అవి పూర్తయ్యేసరికి అంతా అదే నోళ్లతో పొగుడుతున్నారు. సచివాలయ నిర్మాణం వద్దని వాపోయారు. ఒక్క ఏడాదిలోనే కట్టాం. వద్దన్నవాళ్లే ఇప్పుడు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. పర్యాటకులు పెరిగారు. నూతన వధూవరులు కూడా వచ్చి వెడ్డింగ్ షూట్లు చేసుకొంటున్నారు. అంత అందంగా తీర్చిదిద్దాం’ అని వివరించారు.
గుడిసెల నుంచి గూగుల్ దాకా.. పాతాళంలో ఉండే బొగ్గు నుంచి అంతరిక్షంలోకి పంపే రాకేట్ దాకా అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. అమెరికా, యూకే దాకా.. ఆ మాటకొస్తే మనిషి భూమ్మీద ఉన్నంతకాలం.. ఆ మనషికి మనసు ఉన్నంతకాలం.. ఆ మనసు తిరుగుతున్నంత కాలం సమస్యలు ఉంటాయి. తెలంగాణ భూతల స్వర్గమైంది.. ఇంకా చేయటానికి ఏమిలేదు అనను. ఇంకా చేయాల్సి ఉన్నది. ప్రభుత్వాలు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.
– మంత్రి కేటీఆర్
సంస్కరణలు
తెలంగాణలో పరిపాలనా సంస్కరణలు చాలా వేగంగా జరగటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చటంతో 3,400 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని గుర్తుచేశారు. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లాల కల సాకారమైందని చెప్పారు. సిద్దిపేటను జిల్లా చేయాలని 1983లో కేసీఆర్ డిమాండ్ చేశారని, ఇప్పుడది సాకారమైందని తెలిపారు. అలాగే మంచిర్యాల, వికారాబాద్ వంటివి జిల్లాలుగా అవతరించాయని, వాటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్కు మాకు తేడా ఏంటంటే.. ఛత్తీస్గఢ్ కొత్త అసెంబ్లీని ఇటీవల ప్రారంభించుకొ.. 2001లో ఛత్తీస్గఢ్ ఏర్పడితే వారికి అసెంబ్లీ కట్టుకోవటానికి 22 ఏండ్లు పట్టింది. ఇదే కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఉన్న తేడా. వాళ్లు 55 ఏండ్లు తీసుకొంటే మేము కేవలం 9 ఏండ్లలో అద్భుతాలు చేశాం.
– మంత్రి కేటీఆర్
ఆర్నెల్లు సమయం ఉన్నది.. వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం
ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఆధారంగానే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ ఎమ్మెల్యేలంతా మంచిగా పనిచేస్తున్నారని, అక్కడో ఇక్కడో ఎక్కడైనా పనితీరులో వెనకబడ్డామనుకుంటే వారికి ఇంకా ఆర్నెల్ల సమయం ఉన్నదని చెప్పారు. ఈ లోపు వారు ప్రజలకు ఇచ్చిన హామీలు.. చేసిన వాగ్దానాలు నెరవేర్చి మంచిపేరు తెచ్చుకొంటారని తెలిపారు. మంచిగా పనిచేసినవారికి మరోసారి పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పిస్తుందని వెల్లడించారు. 2018లో ఏడుగురిని మాత్రమే మార్చామని గుర్తుచేశారు.
రూ.200 పెన్షన్ను రూ.2,000కు పెంచిన కేసీఆర్ కావాలా?
మళ్లీ రూ.200 పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా?
55 ఏండ్లు అవకాశం ఇస్తే కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ కావాలా?
24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా?
రాబందుల్లా పీక్కుతిన్న కాంగ్రెస్ కావాలా? రైతుబంధు ఇస్తున్న కేసీఆర్ కావాలా?
ఎకరాకు 15 క్వింటాళ్ల ధాన్యానికే సీలింగ్ పెట్టిన కాంగ్రెస్ కావాలా?
ప్రతి క్వింటా కొంటున్న కేసీఆర్ కావాలా?
కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తామో చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తున్నది. మరి ప్రజలకు ఎవరు కావాలి?
సమ ఉజ్జీలతోనే పోటీ.. మరుగుజ్జులతో కాదు.
గుడిసె నుంచి గూగుల్ దాకా.. పాతాళంలోంచి అంతరిక్షంలోకి పంపే రాకేట్ దాకా దూసుకుపోతున్న తెలంగాణ.
మళ్లీ కాంగ్రెస్ దుష్పరిపాలన.. దుష్ఫలితాలు కావాలా? బీఆర్ఎస్ సుపరిపాలన కావాలా?
సమగ్ర.. సమతుల్య.. సమీకృత.. సమ్మిళిత అభివృద్ధి సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ
-దేశానికి కావాల్సింది ఫ్రంట్లు, టెంట్లు కాదు.. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే
-దేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాలదే 36 శాతం
-ఉత్తరాదికి నిధులివ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదు
-తెలంగాణకు ఎందుకివ్వరని ప్రశ్నించాం
-అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాలన్నాం
-మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్
తెలంగాణ మాడల్కన్నా గొప్ప మాడల్ దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఉన్నదా? ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకెవరైనా సరే తెలంగాణ కంటే అద్భుతమైన మాడల్ ఏదైనా ఉన్నదా? చెప్పాలి. తెలంగాణకన్నా ఇతర రాష్ర్టాల్లో అద్భుతాలు చేస్తున్నాయని నిరూపించే సత్తా ఉంటే చెప్పండి. ఆ పార్టీల పాలిత రాష్ట్రాల్లో ఏ రంగంలో అయినా తెలంగాణకంటే మెరుగైన పరిపాలన అందించారా? ఈ విషయంపై ప్రజలు కూడా ఆలోచించాలి.
– మంత్రి కేటీఆర్
దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కావలసింది ఫ్రంట్లు.. టెంట్లు కాదని, ఒకరిని ఓడించటం.. మరొకరిని గద్దెమీద కూర్చొబెట్టం బీఆర్ఎస్ సిద్ధాం తం కాదని స్పష్టం చేశారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే పాలన అందించాలన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని తెలిపారు. సమదృష్టితో దేశాన్ని పాలించే విధానం కావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, బీఆర్ఎస్ పాలనలో అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ మాడల్ను నేడు దేశమంతా కోరుకొంటున్నదని తెలిపారు.
మార్పే మా లక్ష్యం..
దేశంలో ఉన్నది బహుళపార్టీ వ్యవస్థ అని, ద్విపార్టీ వ్యవస్థ కాదని కేటీఆర్ చెప్పారు. అర్హత ఉన్న నాయకుడే దేశాన్ని పాలిస్తాడని తెలిపారు. ‘అయితే బీజేపీ పాలించాలి.. లేకుంటే కాంగ్రెస్ పాలించాలనే ఆలోచన సరైంది కాదు. నిజానికి ఆ రెండు పార్టీలు మాత్రమే పాలించాలని ప్రజలు కోరుకోవడంలేదు. అనతికాలంలోనే అభివృద్ధికి, సంక్షేమానికి తెలంగాణ రోల్ మాడల్గా నిలిచింది. దేశం ఇవ్వాళ ఇదే నమూనాను కోరుకొంటున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పుట్టింది. తెలంగాణ పథకాలను మహారాష్ట్ర, కర్ణాటకసహా అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? మోదీ ఏం చేస్తారు? అనేది మాకు అవసరం లేదు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పడింది. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్పై విస్తృత చర్చ జరుగుతున్నది.
ఫ్రంట్లు, టెంట్లు అవసరం లేదు
‘ఎంతసేపూ థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ టెంట్లు గురించే కాదు.. అక్కడో దుకాణం పెట్టి, ఇక్కడో దుకాణం పెట్టి.. ఆయన్ని పడగొట్టుడే మా లక్ష్యం. ఈయనను గుంజేసుడే మా లక్ష్యం అనేది ఏం పద్ధతి? మీ దగ్గర మాకంటే మంచి కార్యాచరణ ఉంటే ప్రజలకు చూపండి’ అని కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చినట్టు దేశమంతా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మైనార్టీ వెల్ఫేర్లో తెలంగాణ దేశానికే రోల్ మాడల్ అని వేరే రాష్ర్టాలకు వెళ్లి అసుదుద్దీన్ పదేపదే చెప్తున్నారని అన్నారు. ఎంఐఎం ఎక్కడ, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు.
ఏబుల్ గవర్నమెంట్.. స్టేబుల్ లీడర్షిప్ తెలంగాణలోనే ఉన్నది. గతంలో బెంగాల్ ఏం ఆలోచిస్తదో భారతదేశం దాన్ని ఆచరిస్తది అనే నానుడి ఉండేది. నేడు తెలంగాణ ఏం చేస్తే రేపు దేశం దాన్ని అనుసరిస్తుంది అనేదాకా తెలంగాణ ఎదిగింది.
తెలంగాణ ఆచరణ.. దేశం
అనుకరణ నేడు తెలంగాణ ఏది చేస్తే, రేపు దేశం అదే చేసే పరిస్థితి వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ చూసి. మహారాష్ట్ర ఎం హబ్ అని మొదలుపెట్టిందని గుర్తుచేశారు. టీ హబ్, టీ వర్క్స్ అనే కాదు.. దళితబంధు, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ.. పాతాళంలో ఉండే బొగ్గు నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్ల దాకా అన్నిరంగాల్లో తెలంగాణను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు.
మోదీని ఛీకొట్టిన కర్ణాటక
ప్రధాని మోదీ, ఆయన మంత్రిమండలి మొత్తం తిష్టవేసి, ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ప్రచారం చేసినా కర్ణాటక ప్రజలు వారిని ఛీకొట్టారని కేటీఆర్ ఎద్దేశా చేశారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, మునుగోడు ఉపఎన్నికలో ఇంతమంది పనిచేస్తారా? అని మాట్లాడారు. మరి కర్ణాటకలో వారు చేసిందేమిటి. మణిపూర్ ఒకవైపు మండిపోతుంటే.. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. వీటన్నింటినీ ఆలోచించారు కాబట్టే కర్ణాటక ప్రజలు చెడు పాలనకు చరమగీతం పాడారు. తెలంగాణలో మేము మెరుగైన పాలన అందించాం కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. ఎలాంటి నాయకులు కావాలి? ఎలాంటి పాలన కావాలి అనేది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
మహారాష్ట్రలో పీఠాలు కదిలాయి
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ మూడు మీటింగులు పెట్టగానే అక్కడి పార్టీల పీఠాలు కదులుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల అభీష్టం మేరకు మహారాష్ట్ర గవర్నమెంట్ రైతుబంధులాంటి పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు. పీఠాలు కదులుతున్నాయనే భయం పుట్టింది కాబట్టే అక్కడ మార్పులు జరుగుతున్నాయని, అటువంటి మార్పునే దేశం కోరుతున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ బీఆర్ఎస్ విస్తరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, విజయవాడ మాజీ మేయర్ కూడా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని చెప్పారు.
అభివృద్ధి ‘స్క్రూ’ తిప్పిన బీఆర్ఎస్
దేశానికి ఉత్తమ పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ సిద్ధాంతాన్ని, పనులను నమ్మి ఎవరైనా కలిసివస్తే.. వారితో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని కేటీఆర్ తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ ఒకరు, ఒడిశా మాజీ సీఎం కూడా బీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. ‘మేము అభివృద్ధి అనే స్క్రూ తిప్పాం. అది తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దేశాన్ని ఎలా అభివృద్ధి బాట పట్టించాలో మాకొక ప్రణాళిక, కార్యాచరణ ఉన్నది’ అని పేర్కొన్నారు.
మోదీ అసమర్థతపై చర్చ జరగాలి
ప్రధాని మోదీ హయాంలో జరిగిన అతిపెద్ద సంక్షోభం నోట్ల రద్దు అని, దానివల్ల ఇబ్బందులు పడ్డది సామాన్యులేనని కేటీఆర్ విమర్శించారు. ‘ఏ దేశమైనా తమ పౌరులకు ఉచితంగానే వ్యాక్సినేషన్ చేస్తుంది. గతంలోనూ ఇండియాలో పలు వ్యాధులకు వ్యాక్సినేషన్ ఉచితంగానే చేశారు. మోదీ ప్రభుత్వమే తొలిసారి ఉచితంగా, ఉదారంగా ప్రజలకు వ్యాక్సినేషన్ చేపట్టినట్టు పబ్లిసిటీ చేసుకొన్నది. చేతకాని ప్రధానికి సంబంధించి ఇట్లాంటి లోపాలను వందల్లో చూపించగలం. దేశ అభివృద్ధిని మరిచిన మోదీ అసమర్థతపై చర్చ పెట్టాలి’ అని మీడియాను కోరారు. సీఎం కేసీఆర్ దగ్గర ఓ అభివృద్ధి మంత్రం, మాడల్ ఉన్నదని, దానిని దేశానికి చూపించాలని భావిస్తున్నామని చెప్పారు.
‘తెలంగాణ మాడల్ను చూసే కదా 75 ఏండ్ల స్వతంత్ర భారతం తిరిగి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నది. తెలంగాణలో ప్రజలందరికి తాగునీరు ఎలా అందించగలిగారు? నిరంతరాయంగా విద్యుత్తు ఎలా ఇవ్వగలుగుతున్నారు? రైతులకు సాగునీరు, సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నారు.? అనే విషయాలను దేశం మొత్తం చర్చిస్తున్నది. ఇదే మా అజెండా, ఇదే మా ఆలోచన’
– మంత్రి కేటీఆర్
అసమర్థ ప్రధాని మోదీ
‘75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మోస్ట్ ఇన్ కాంపిటెంట్, మోస్ట్ ఇన్ఎఫిషీయంట్, మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఒక్కరే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
-ఎన్నో ప్రభుత్వ ఆస్తులను గుంపుగుత్తగా అమ్మిన ఏకైక ప్రధాని మోదీ.
-75 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం మోదీ హయాంలోనే పెరిగింది.
-40 ఏండ్ల గరిష్ఠ స్థాయికి నిరుద్యోగిత రేటును పెంచిన ఘనత మోదీదే.
-వంటగ్యాస్ సిలిండర్ ధర వందరెట్లు పెరిగింది మోదీ హయాంలోనే. ఏ దేశంలోనూ లేనంతగా గ్యాస్ ధరలు ఇండియాలో పెరిగాయి.
-దేశంలో మునుపెన్నడూ లేనతంగా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచింది మోదీనే. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 66 డాలర్లకు తగ్గినా.. దేశంలో పెట్రోల్ ధరలు రూ.100 నుంచి రూ.110 పైగానే ఉన్నాయి. దీనికి బాధ్యుడు మోదీ.
-దేశంలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పతనమైంది మోదీ హయాంలోనే.. మోదీని అసమర్థ, చేతకాని, అప్రభావిత ప్రధాని అంటూ తూర్పారబట్టారు.

