పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. నేతలు సూచనలు, అభిప్రాయాలను పెద్దలు స్వీకరించారని తెలిపారు. సమష్టి కృషితో పనిచేయాలని నిర్ణయించారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారన్నారు.

కాంగ్రెస్ పార్టీ పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్టు ఉందని బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకు దాడులకు దిగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రైతుబంధు కింద విడుదల చేసిన డబ్బులు ఏమైపోయాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పథకాలకు ఇచ్చిన ప్రోసీడింగ్ నిలిపివేడయం సరికాదని అన్నారు. ప్రజాపాలన పేరుతో హామీల అమలును వాయిదా వేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ముందు కంచెలు ఎందుకు కూలగొట్టలేదని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరుతో దరిద్రపు పాలన చేస్తున్నారని అన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం : కడియం శ్రీహరి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమయ్యిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. గృహలక్ష్మీ పథకం రద్దుతో లక్షలాది మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రెండో విడబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని.. కానీ కాంగ్రెస్ దళితబంధును పట్టించుకోవడం లేదన్నారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామన్నారని. ఇంకా ఇవ్వలేదని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే దాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయని అన్నారు.
ఎలాంటి అవగాహన లేకుండానే మంత్రులు మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. మోసపూరిత ప్రకటనలు చేయడం కాంగ్రెస్ మానుకోవాలని హితవుపలికారు. నమ్మి ఓటేసిన యువతకు కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని విమర్శించారు.

