-రెవెన్యూశాఖ పైనా దృష్టి -డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఫైనలియర్కే పరీక్షలు -ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులంతా పాస్ -రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం -దీర్ఘకాలిక వ్యూహంతో పక్కా ప్రణాళిక -విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయ సేకరణ -అనాథ ఆడపిల్లల చదువు బాధ్యత సర్కారుదే -త్వరలోనే ప్రభుత్వ సమగ్ర విధాన ప్రకటన -ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సరం -సెట్ల షెడ్యూల్ ప్రభుత్వమే రూపొందిస్తుంది -విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

‘సదాశివయ్యగారూ.. మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయపూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్టుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
– మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్తో సీఎం కేసీఆర్
కేసీఆర్ కిట్స్ పథకం అమలుచేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం ఏర్పడింది. ఓపీ పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుంది.
– సీఎం కేసీఆర్
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు, సిలబస్ తదితర విషయాలపై యూజీసీ, ఏఐసీటీఈ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. కొవిడ్-19 నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతంచేసే విషయాలపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టడం సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

రెవెన్యూ, విద్యావ్యవస్థలపై దృష్టి
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టామని, క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తూ వస్తున్నామని సీఎం చెప్పారు. ‘విద్యుత్ సమస్య పరిష్కారమైంది. మంచినీటి గోస తీరింది. సాగునీటి సమస్య పరిష్కారమవుతున్నది. వ్యవసాయరంగం కుదుటపడుతున్నది. భూకబ్జాలు లేవు. పేకాట క్లబ్బులు పోయాయి. గుడుంబా బట్టీలు ఆగిపోయాయి. ఇలా అనేక సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నాం. ఇక రెవెన్యూశాఖ ప్రక్షాళన, విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
త్వరలోనే వర్క్షాప్
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచడానికి ఏమి చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఒక వర్క్షాప్ నిర్వహించి, విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ‘కేసీఆర్ కిట్స్ పథకం అమలుచేయడంతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడింది. ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం ఏర్పడింది. ఓపీ పెరిగింది. వైద్యరంగంలో దోపిడీ ఆగింది. అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుంది. దోపిడీ ఆగిపోతుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
అనాథ ఆడపిల్లల చదువు బాధ్యత సర్కారుదే
అనాథ ఆడ పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ‘అనాథ ఆడపిల్లలు ప్రస్తుతం పదో తరగతి వరకు కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్నారు. తర్వాత వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఈ విషయంలో త్వరలోనే విధాన నిర్ణయం ప్రకటిస్తాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షా కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, సీనియర్ అధికారులు నవీన్మిట్టల్, ఒమర్ జలీల్, శ్రీహరి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు..
విద్యావ్యవస్థ పవిత్రత (అకడమిక్ శాంటిటీ)ను కాపాడే ఉద్దేశంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. మిగతావారిని పై తరగతులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్చేయాలి. ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి. విద్యార్థులు విలువైన విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశపరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం రూపొందిస్తుంది. రాష్ట్రంలో పాఠశాలల పున: ప్రారంభం ఎప్పుడుచేయాలి, విద్యాబోధన ఎలా జరగాలనే విషయాలపై కేంద్ర మార్గదర్శకాలను, ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏమి చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది. మీలాంటి వారే సమాజానికి కావాలి
ఇద్దరు అధ్యాపకులకు సీఎం ప్రశంసలు
విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడంలాంటి సామాజిక కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారని, అలాంటివారిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఈ ఇద్దరూ తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులివ్వాలని సీఎం నిర్ణయించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుచేయాలని సంకల్పించిన సదాశివయ్యతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ‘సదాశివయ్యగారూ.. మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టీవీల్లో స్వయంగా చూశాను.
మీ అంకితభావం గొప్పది. మీకు హృదయపూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్టుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరుచేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్ఫూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశంతో మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అని సీఎం చెప్పారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరుచేయాలని అధికారులను ఆదేశించారు.