
-అబద్ధాల స్క్రిప్ట్ రాసిస్తే చదివి వినిపించారు -కామన్ మినిమం ప్రోగ్రాంను తుంగలో తొక్కారు -యువత బలిదానాలకు కాంగ్రెస్ వైఖరే కారణం -పసుపు బోర్డుపై బ్లేమ్ గేమ్ మంచిది కాదు -పంచాయతీలకు నిధులిచ్చింది మీవాళ్లకు కనిపించలేదా? -రాహుల్గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ కవిత
స్థానిక కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్ట్ను రాష్ట్రంలో పర్యటించిన రాహుల్గాంధీ చదివి వినిపించారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మొదటినుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకొన్న కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ యువత బలిదానాలు జరిగాయన్నారు. నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రానికి లేఖరాస్తానని చెప్పడం కేవలం బ్లేమ్ గేమ్ మాత్రమేనని ఎద్దేవాచేశారు. తెలంగాణపై రాహుల్గాంధీది ముమ్మాటికీ మొసలి కన్నీరే అని చెప్పారు. నిజంగానే ఇక్కడి ప్రజలపై ప్రేమే ఉంటే తెలంగాణకు చెందిన ఐదు అంశాలపై పోరాడుతున్న మాతో డిసెంబర్లో జరిగే పార్లమెంట్ సెషన్లో కలిసిరండి అని సూచించారు. శుక్రవారం నిజామాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. 2001లో ఉద్యమం ప్రారంభించిన తర్వాత కేసీఆర్తో పొత్తుపెట్టుకొన్న కాంగ్రెస్.. 2004లో యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తుంగలో తొక్కింది రాహుల్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

బ్లేమ్గేమ్ మంచి పద్ధతి కాదు నాలుగున్నరేండ్లుగా పసుపుబోర్డు ఏర్పాటుకు జాతీయస్థాయిలో ఆందోళన చేస్తున్నది మీకు కనిపించలేదా? అని రాహుల్గాంధీని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే పసుపుబోర్డుకు లేఖ రాస్తానంటావ్.. బ్లేమ్ గేమ్ ఆడటం మంచి పద్ధతి కాదని సూచించారు. నిజంగానే పసుపురైతులపై మీకు ప్రేమే ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పారు.

భీంగల్లో రోడ్షో అన్నం పెడుతున్న పెద్దకొడుకు అని కేసీఆర్ను పింఛన్లు పొందుతున్న వారు ఎందరో కొనియాడుతున్నారని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ను ఆశీర్వదించి మరోసారి అధికారం అందించాలని కోరారు. శుక్రవారం రాత్రి బాల్కొండ నియోజకవర్గం భీంగల్లో రోడ్షోలో కవిత పాల్గొని మాట్లాడారు. బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలతో కలిసి కవిత బొడ్డెమ్మ ఆడి ఉత్సాహపరిచారు. రోడ్షోలో బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.