-సిద్దిపేట లేకపోతే.. కేసీఆర్ లేడు.. తెలంగాణ లేదు -ఇక్కడి నీళ్లగోస నుంచి పుట్టిందే మిషన్ భగీరథ -ప్రజాధనాన్ని సద్వినియోగంచేసే నియోజకవర్గమిది -తెలంగాణకోసం దుఃఖంతో సిద్దిపేటను వదిలిన -రాష్ట్రం తెచ్చి అందరిలోనూ ఆనందం నింపిన -సాంస్కృతిక ఆడిటోరియానికి 50 కోట్లు మంజూరు -సిద్దిపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

ఈ పట్టణంతో వీడదీయని అనుబంధం ఉన్నది. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఇది సిద్ది పొందిన పేట. ఈ గడ్డ నుంచి ఢిల్లీ వెళ్లి తెలంగాణ తెచ్చి ప్రజల చేతుల్లో పెట్టిన. దుఃఖంతో నియోజకవర్గాన్ని వదిలినా.. ఆణిముత్యంలాంటి హరీశ్ను మీకు అప్పజెప్పిన. ఆ పిల్లాడు నా పేరు కాపాడిండు. సిద్దిపేటను అద్భుతంగా అభివృద్ధి చేసిండు. – ముఖ్యమంత్రి కేసీఆర్
ఆణిముత్యం హరీశ్ గట్టి నాయకుడు.. నా పేరు నిలబెట్టిండు అద్భుతమైన సిద్దిపేటను తయారు చేసిండునా గుండెల నిండా సంతోషం నింపిన వ్యక్తిచి నాయకుడు.. గొప్ప కార్యకర్తలున్నరు సిద్దిపేటకు గొప్ప భవిష్యత్తు: సీఎం కేసీఆర్
తెలంగాణను స్పృశింపజేసిన గడ్డ సిద్దిపేట అని, ఆ పేరులోనే ఏదో బలమున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. సిద్ది పొందిన పేటగా ప్రసిద్ధి పొందిన సిద్దిపేట దేశానికే రోల్మోడల్గా మారిందని తెలిపారు. ఈ పట్టణం నీటి గోస నుంచి పుట్టిందే మిషన్ భగీరథ అని.. ఈ పథకం దేశంలోని అనేక రాష్ర్టాలకు, కేంద్రప్రభుత్వ జల్జీవన్కు స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. కరీంనగర్ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట అంటే నాకు ప్రాణం.. రెండుచోట్ల నుంచి గెలిచాక.. తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటను వదిలేయాల్సి రావడం ఎంతో దుఃఖాన్ని కలిగించిందని చెప్పారు. అట్ల మీరు ఢిల్లీకి పంపినదానికి.. అందరి పేరు నిలబెడుతూ తెలంగాణ తెచ్చి ప్రజల చేతుల్లో పెట్టిన అని అన్నారు. పోతూ పోతూ ఆణిముత్యంలాంటి హరీశ్ను నియోజకవర్గానికి అప్పజెప్పిన అని.. ఆ పిల్లోడు తన పేరును నిలబెట్టడంతోపాటు, అద్భుతమైన సిద్దిపేటను తయారుచేసినందుకు గుండెల నిండా సంతోషంగా ఉన్నదని చెప్పారు. ‘కరీంనగర్ పర్యటనకు వెళ్తున్న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను ఆపి.. మ్యాప్గీసి మరీ సిద్దిపేటను జిల్లా చేయాలని దండం పెట్టి కోరిన. అయితే అప్పుడు అనేక కారణాల వల్ల రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడలేదు. తెలంగాణ అయిన తర్వాత అభివృద్ధిని కాం క్షించి 33 జిల్లాలను చేసుకున్నాం. ఆ క్రమంలోనే సిద్దిపేట జిల్లా అనే నా కల నెరవేరింది. భగవంతుడి దయ, పెద్దల ఆశీర్వచనం. మీ అందరి దీవెన. నా కల లు దాదాపు నెరవేరాయి’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. గురువారం సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్.. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…
సిద్దిపేట నా ప్రాణం సిద్దిపేట అంటే నాకు ప్రాణం. ఇక్కడ నేను నిలబడ్డ జాగ (సిద్దిపేట డిగ్రీకాలేజీ) నుంచి రంగనాయకసాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట (పళ్ల గుట్ట) వరకు మా రాధాకృష్ణ శర్మగారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్ ఎన్నోసార్లు కాలినడక వెళ్లినం. ఆ గుట్టమీద నీళ్లట్యాంక్ కట్టేందుకు కాలినడకన, మోటర్ సైకిళ్లపై తిరిగినం. నాడు నేను సిద్దిపేట రింగ్రోడ్డును నిర్మిస్తే ఇయ్యాళ హరీశ్ దానిని డబుల్రోడ్డు చేసిండు. చాలా తృప్తిగా ఉన్నది. ఈ రోడ్డెందుకు అన్నవాళ్లకు ఇప్పుడు దాని ప్రాముఖ్యమేందో కనపడుతున్నది.
నాటి బాధలు కండ్లలో గిర్రున తిరుగుతున్నయ్ అప్పట్లో ట్రాన్స్ఫార్మర్లు పటాకులు కాలినట్టు కాలిపోయేవి. నేను, బావ అని పిలుచుకునే మేడిపల్లి సత్యనారాయణరెడ్డి సాయంత్రందాకా 133 కేవీ సబ్స్టేషన్లోనే కూర్చొని వాటిని బాగు చేయించుకుని పోయేటోళ్లం. ఆ బాధలన్నీ కండ్లళ్ల గిర్రున తిరుగుతున్నయ్. ఒక కరెంటు లైన్ ఏయించాలన్నా.. నాలుగు కరెంటు పోల్లు కావాలన్నా ఎంతో కష్టమయ్యేది. భగవంతుడి దయవల్ల తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో కరెంటు కష్టాల్లేవు. భవిష్యత్తులో రావు. అవసరమైతే ఇతరులకు కరెంటిచ్చే స్థాయికి ఎదుగుతున్నం. ఎమ్మెల్యేగా ఉం డగా.. ట్యాంకర్లు పెట్టి నీళ్లు తెప్పించేవాళ్లం. అవికూడా అగ్గిమీద నీళ్లు చల్లినట్టు ఏమూలకూ సరిపోయేవి కాదు. 30 బోర్లు వేసినా ఒక్కదాంట్ల కూడా నీళ్లు ఎళ్లకపోయేది. ఆ గోస పడలేక లోయర్ మానేరుడ్యాం నుంచి నీళ్లు తెచ్చుకున్నం. సిద్దిపేట మంచినీటి కోసం ఏర్పాటుచేసుకున్న ఈ నీటి వసతే నేడు మిషన్భగీరథ అయింది. యావత్ రాష్ర్టానికి అద్భుతమైన మంచినీటి సదుపాయం వచ్చింది. ఈ మాట కేంద్రమే స్వయంగా చెప్పింది. ‘దేశంలోనే 98.31 శాతం ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ’ అని చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ బిడ్డ కేసీఆర్ సాధించిన ఘనత. సిద్దిపేట సాధించిన ఘనత.
నాడు చుక్కనీటికీ బాధపడ్డాం రంగనాయకసాగర్ గెస్ట్హౌస్ల కూర్చుని అన్నం తింటుంటే.. ఒకవైపు కండ్లలో నీళ్లు వచ్చినయ్.. మరోవైపు ఒళ్లు పులకరించింది. ఒకనాడు సిద్దిపేటలో చుక్క మంచినీళ్లు కనిపించేవి కావు. పొన్నాల, దోర్నాల దగ్గర, చుట్టుపక్కల గ్రామాల్లో బాయిలు తవ్వి అక్కడ్నుంచి ట్యాంకర్లలో నీళ్లు మోసుకొచ్చేది. రైతులు బోర్లు వేస్తే నీళ్లు పడకపోయేవి. బోరు ఏడపడ్తదో సూపిస్తెందుకు ఒకడు తంగెడు కట్టెతోటి, ఇంకోడు రాగి తీగతోటి.. మళ్లొకడు కొబ్బరికాయ, తాళాల గుత్తి పట్టుకుని వచ్చేటోడు.. ఇట్లా ఎన్నిబాధలు. ఇవాళ కాళేశ్వరస్వామి, రంగనాయకస్వామి దయవల్ల సిద్దిపేట రంగనాయకసాగర్ అద్భుతమైన సాగునీటి వసతిగా మారింది. 365 రోజులు నీటితో కళకళలాడుతున్న య్. రంగనాయకసాగర్ తెలంగాణకే ఒక సుందరస్పాట్గా తయారు కావాలి. అంతర్జాతీయస్థాయిలో కన్వెన్షన్ సెంటర్లు, డెస్టినేషన్ పెండ్లిళ్లు.. డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్గా అద్భుతమైన స్టార్ హోటళ్లతో అది ఏర్పాటుకావాలి. నీటిమధ్యలో ఉన్న 65 ఎకరాల భూమి గొప్ప పర్యాటకప్రాంతంగా తయారైతది. రంగనాయకసాగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 100కోట్లు మంజూరు చేస్తున్నా. యాడాది రెండేండ్లకు నేను మళ్లీ వస్తే.. రంగనాయకసాగర్ అభివృద్ధి చూసేందుకు రెండు కండ్లు సరిపోనంతగా ఉండాలి. నాయకుడు గట్టోడు ఉన్నడు కాబట్టి దాన్ని సాధిస్తడు. దాంట్లో ఏ అనుమానం లేదు. మూడు నియోజకవర్గాల పరిధిలో కొన్ని గ్రామాలకు కాళేశ్వరం నీళ్లు రాలేదు. రూ.80 కోట్లతో మల్లన్నసాగర్ వద్ద చిన్నలిఫ్ట్ పెడితే ఈ గ్రామాలకు నీళ్లందుతాయి. ఇర్కోడు పేరిట లిఫ్ట్ ఇరిగేషన్తో దీనిని సాధిద్దాం.
22 గ్రామాలు.. 75 కి.మీ. రింగురోడ్డు నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో సిద్దిపేట రింగ్రోడ్డు కావాలని కోరుకున్నాం. అది పూర్తయింది. ఇక రెండు కొసలు మిగిలిపోయినయ్.. వాటిని కూడా లింకుచేస్తూ రాజీవ్ రహదారి టూ రాజీవ్ రహదారి ఏర్పాటుచేస్తాం. పొన్నాల దగ్గర ప్రారంభించి దుద్దెడ వరకు వచ్చేలా.. 75 కిలోమీటర్లు తిరిగి 22 గ్రామాలు చుట్టుకుంటూ మళ్లీ దుద్దెడకు వచ్చి రాజీవ్ రహదారి కలుస్తది. దీనికి హరీశ్ ఇప్పటికే ప్రపోజల్ కూడా పంపించారు. రూ. 160 కోట్లు ఇస్తే డబుల్ రోడ్డు అయితదని అన్నారు. ఇది కూడా మంజూరు చేస్తున్నా.. రేపే జీవో విడుదల చేస్తా. మంత్రి ప్రశాంత్రెడ్డి ఇక్కడే ఉన్నారు.. ‘చేస్తావా.. సిద్దిపేటలో చెప్తున్నావు సుమా..!’
సిద్దిపేట ఇండియాకే రోల్మోడల్ సిద్దిపేటను ఈ రోజు చూస్తూ చాలా సంతోషంగా ఉంది. పేదలు అత్మగౌరవంతో బతకాలనే నా కల నిజమైంది. సిద్దిపేట ఇండియాకే ఒక రోల్ మోడల్గా ఉం ది. ఎంపీ ప్రభాకర్రెడ్డి ఉండే గేటెడ్ కమ్యూనిటీలో కూడా పైప్ద్వారా గ్యాస్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండదు. అది కొంచెం కష్టం. కానీ హరీశ్, కలెక్టర్ శ్రమించి ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ చేయించారు. అమెరికాలాంటి దేశంలో తప్పా ఇండియాలో మరెక్కడా లేదు. వాళ్లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సిద్దిపేట పట్టణం పెరుగుతున్నది కాబట్టి త్రీటౌన్ పోలీస్స్టేషన్ అవసరమున్నదని పోలీస్ కమిషనర్, హరీశ్రావు చెప్పారు. వెం టనే మంజూరుచేస్తున్నా. దీన్నికూడా ఆ కాలనీ పక్కనే ఏర్పాటుచేయాలని కోరుతున్నా. బస్తీ దవాఖాన కావాలని అడిగారు. నెల లోపల రాజేందర్, హరీశ్ ఆ దవాఖానను ప్రారంభించాలని కోరుతున్నా. సిద్దిపేట కోమ టి చెరువును హరీశ్రావు కోటిఅందాల చెరువుగా తయారుచేశారు. నేను చెరువు కట్ట మొదలుపెట్టి పొ యిన.. మిగిలిన పనులన్నీ చాలా గొప్పగా చేసిండు. దీనికి మరో రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నా.

ఈశాన్యం మూలన చెరువు.. అద్భుతం అప్పట్లో ఈశాన్యం మూలన చింతల చెరువు ఉండే.. దాన్ని తలదన్నేట్టు ఇప్పుడు రంగనాయక సాగర్ వచ్చింది. అంత గొప్ప చెరువు ఈశాన్యంలో వచ్చిందంటే ఈ పట్టణం అద్భుతమైన పట్టణంగా వెలుగొందుతదని చెపుతున్నా.. ఇందులో డౌటే లేదు.
రూ. 50 కోట్లతో సాంస్కృతిక వేదిక ,సిద్దిపేట అద్భుతమైన సాంస్కృతిక వేదిక. వేముగంటి నుంచి మా నందిని సిధారెడ్డి, అంజయ్య వరకు చాలామంది కవులు, కవి మిత్రులున్నారు. చిత్రకారుడు రాజయ్యగారు.. ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈ పట్టణానికి పెద్ద ఆడిటోరియం రావాలి. గజ్వేల్లో నేను కట్టించిన ఆడిటోరియం చాలా బాగా వచ్చింది. దాన్ని తలదన్నేలా ఇది రావాలి. ఇందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నా. 2వేల మందికిపైగా కూర్చునేలా మంచి ఆడిటోరియం కట్టించాలని హరీశ్ను కోరుతున్నా. అలాగే
గజ్వేల్లో మార్కెట్ను మించి సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టేందుకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నా. సిద్దిపేటకు కొద్ది రోజుల్లోనే రైలు కూడా వస్తది. రైలు వస్తే సిద్దిపేట పెద్ద కమర్షియల్ టౌన్ అవుతది. రాబోయే రోజుల్లో హైదరాబాద్కు మరొక ఎయిర్ పోర్ట్ అవసరం ఉంటే శామీర్పేట వైపు రానుంది. సిద్దిపేటకు దగ్గరగా ఉంటుంది. సిద్దిపేటకు గొప్ప భవిష్యత్ ఉంటుంది. ఐటీ హబ్ ఈరోజు శంకుస్థాపన చేసిన. నాలుగు కంపెనీల వాళ్లు కంపెనీలను మొదలు పెడు తాం, మాకు స్థలం చూపించండి సార్ అన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు.
ఆణిముత్యం హరీశ్ సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థికమంత్రి హరీశ్రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను అప్పగించిన సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. సందర్భం వచ్చినప్పుడల్లా పిల్లోడు.. గట్టి నాయకుడు.. పేరు నిలబెట్టిండు అంటూ ప్రశంసించారు. సిద్దిపేట నుంచి వెళ్తూ వెళ్తూ ఆణిముత్యంలాంటి హరీశ్కు నియోజకవర్గాన్ని అప్పజెప్పిన అని.. ఆ పిల్లోడు తన పేరు నిలబెట్టాడని కొనియాడారు. సిద్దిపేటను అద్భుతంగా తయారుచేసి తన గుం డెల నిండా సంతోషం నింపారని చెప్పారు. నాడు ఎమ్మెల్యేగా సిద్దిపేట రింగ్రోడ్డును నిర్మిస్తే.. ఇ య్యాల హరీశ్ దానిని డబుల్రోడ్డుగా మార్చడం తృప్తిని కలిగించిందని కొనియాడారు. సిద్దిపేటలో 2వేల మంది కూర్చునేలా ఆడిటోరియం కట్టించాలని రూ. 50 కోట్లు మంజూరుచేసిన సీఎం కేసీఆర్.. గజ్వేల్లోని ఆడిటోరియాన్ని తలదన్నేలా దానిని నిర్మించాలని హరీశ్రావుకు సూచించారు. ‘నాయకుడు బాగుండాలి, కింద ఉండే కార్యకర్తలు, అధికారులతో టీంవర్క్ జరిగితే ఎలాంటి అద్భుతాలైనా సాధించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలకు కేంద్రంగా సిద్దిపేట, స్ఫూర్తిగా హరీశ్రావు నిలుస్తారు’ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు అడిగిన అన్నింటినీ మంజూరుచేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రంగనాయక్సాగర్ నీటిమధ్యలో 65 ఎకరాల భూమి ఉంది. అది గొప్ప పర్యాటకప్రాంతంగా తయారైతది. రంగనాయకసాగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.100కోట్లు మంజూరు చేస్తున్నా. యాడాది రెండేండ్లకు మళ్లీ వస్తే.. రంగనాయకసాగర్ అభివృద్ధి చూసేందుకు రెండుకండ్లూ సరిపోనంతగా ఉండాలి. నాయకుడు గట్టోడు ఉన్నడు. కాబట్టి దాన్ని సాధిస్తడు. దాంట్లో ఏ అనుమానం లేదు. – సీఎం కేసీఆర్
హరీశ్ బాగా హుషార్గా ఉన్నడు. ‘ఏం లేదు.. మీరిచ్చిన కొన్ని మంచిపనులకు శాంక్షన్ ఇచ్చి, కొన్నిటికి రిబ్బన్లు కట్ చేసిపోతే చాలు. ఏం అడగను’ అని హైదరాబాద్లో హరీశ్ చెప్పిండు. ఇప్పుడు మీ ముందల నిలబెట్టిండు. ఇక దొడ్లకొచ్చిన గోద పెండ పెట్టదా అన్నట్టు అన్నీ అడుగుతుండు. – సభలో సభికుల నవ్వుల మధ్య కేసీఆర్
ఇల్లంతకుంట దాకా ఫోర్లైన్ వే సిద్దిపేట నుంచి చిన్నకోడురు వరకు జనాభా పెరిగింది కాబట్టి ఇక్కడ ఫోర్లేన్ రోడ్డు మంజూరు చేయాలని హరీశ్రావు కోరారు. హరీశ్ హుషారని నేను అందుకే అన్నా.. హరీశ్రావు, రసమయి బాలకిషన్ ఇద్దరు బదులుకున్నట్టు ఉన్నరు. నువు ముందుగాళ్ల అడుగు నేను వెనుకకెళ్లి అడుగుతా అని.. ఇక్కడ హరీశ్ మైకుల చెప్తుంటే.. బాలకిషన్ లేసొచ్చి.. సార్ సార్ అయింతా ఇల్లంతకుంట దాకా చేయాలే.. లేదంటే అక్కడ నా ఈపు పగులుతది అని చెప్తుండు. అక్కడిదాకా చేయమని ఈటల రాజేందర్ చెప్తుండు. ఇగ చేయాలేగదా.. ఇల్లంతకుంట 25 కిలోమీటర్ల దూరం ఫోర్లైన్ వే రహదారికి ఆర్డర్ ఇస్తాం. ఈ రోడ్డు మధ్యలో అనంతగిరి ప్రాజెక్టు వచ్చింది.. ఇది మంచి పర్యాటక ప్రాంతంగా ఎదుగుతది. సిద్దిపేటకు మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలని కోరారు. ఇందులో అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా.

మంచి నాయకుడు… అవినీతికి తావు లేదు మీ దీవెనతో ఇక్కడ అనేక పనులు జరిగినయి.. మీరు కోరుకున్నవన్నీ చేసినం. ఇంకాచేస్తాం. సిద్దిపేటలో పనులు ఆగవు. మా నాయకులందరికీ సెల్యూట్ చేస్తున్నా.. చాలా నియోజకవర్గాల వారికి సిద్దిపేటను చూసి నేర్చుకోవాలని చెప్తా. డబ్బుఇస్తే ఇట్ల ఖర్చు పెడతరు. వెంటనే అభివృద్ధి కనిపిస్తది. అవినీతి జరుగదు. కాబట్టి ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే నియోజకవర్గమిది. అటువంటి గడ్డ ఇది. మంచి నాయకుడు, కింద మంచి నాయకులు, గొప్ప కార్యకర్తలున్నారు. అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.
తెలంగాణ బొడ్రాయి సిద్దిపేట తెలంగాణ నడిబొడ్డున, బొడ్రాయి లాంటి పట్టణం సిద్దిపేట. ఇక్కడి నుంచే తెలంగాణ నాయకుడు పెరగడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమం విజయం సాధించడం, అద్భుతమైన ఉద్యమ కార్యకర్త హరీశే ఎమ్మెల్యేగా, నాయకుడిగా ఉండటం, మీరందరూ భుజం భుజం కలపడం, మంచి హృదయంతో పనిచేసే జిల్లా కలెక్టర్ ఉండటం, ఆయన వెంట మంచి అధికారుల బృందం ఉండటంతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. నాయకుడు బాగుండాలి,
జిల్లా కలెక్టర్ బాగుండాలి, కిందఉండే నాయకులు బాగుండాలి, టీం వర్క్ జరిగితేనే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి. మంచి కార్యక్రమాలకు కేంద్రంగా, స్ఫూర్తిగా సిద్దిపేట నిలుస్తుంది, నిలవాలి. మీ బిడ్డగా మీకు ఉన్న కోరికలు తీర్చిన, తిరుస్తనే ఉంటా. మీ దీవెన, మీ ఆశీర్వాదం ఇదేవిధంగా ఉండాలని కోరుకుంటున్న.