ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు దేశానికి ఆదర్శం కానున్నాయి. ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లోని విల్లాలను తలపిస్తున్నాయి. ఇండ్లను చూసిన వారంతా నాతో ఇదే మాట చెప్తున్నారు. వచ్చే మే 15 నుంచి 30లోగా మంచి రోజు చూసుకుని పండుగ వాతావరణంలో కొత్త ఇండ్లలోకి పోదాం. ఆ రోజు నాటికి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఎర్రవల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను, చెక్డ్యామ్ నిర్మాణ పనులు, చెరువు మరమ్మతు పనులను సీఎం కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు.

-గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను తలపించేలా డబుల్బెడ్రూం ఇండ్లు -మే 15నుంచి 30లోగా పండుగ వాతావరణంలో కొత్త ఇండ్లలోకి -ఎర్రవల్లి, నర్సన్నపేటలు దేశానికి పాఠాలు నేర్పుతాయి -కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ రిజర్వాయర్లకు 15 రోజుల్లో టెండర్లు -ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ సభల్లో సీఎం కే చంద్రశేఖర్రావు -డబుల్బెడ్ రూం ఇండ్లు, చెక్డ్యాంల నిర్మాణ పనుల పరిశీలన
నిర్మాణం పూర్తయిన ఇండ్లలోకి వెళ్ళి కలియతిరిగారు. మేడపైకి ఎక్కారు. వరండా, ఇంటి వెనుకభాగంలోని టాయిలెట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. నర్సన్నపేట సమీపంలో కూడవెల్లి వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యామ్ నిర్మాణ పనులు, రెండు గ్రామాల్లో కొనసాగుతున్న చెరువుల మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదిరిందని, వచ్చే 15 రోజుల్లో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ(పాములపర్తి) రిజర్వాయర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో కాలువల ద్వారా వచ్చే గోదావరి జలాలతో ఈ ప్రాంతం కళకళలాడనున్నదన్నారు. గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ సాగు ఆదర్శం కానున్నదని, రెండు గ్రామాలు దేశానికే పాఠాలు నేర్పనున్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా కేసీఆర్ ఎమన్నారంటే….
200 ఎంసీఎఫ్టీ సామర్థ్యంతో కూడిన చెరువులు, చెక్డ్యామ్లు ఎర్రవల్లి, నర్సన్నపేట పరిధిలో 200 ఎంసీఎఫ్టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్) సామర్థ్యంతో చెరువులు, చెక్డ్యామ్లను నిర్మించుకుంటున్నాం. వాటిలోకి నీళ్లు వస్తే మూడు పంటలు పండించుకునే వీలున్నది. చెరువులు, చెక్డ్యామ్లు నిండితే గ్రామంలో సాగునీటి సమస్యే ఉండబోదు.

ఎర్రవల్లిలో ఆటోమెటిక్ వ్యవసాయం… దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఆటోమెటిక్ వ్యవసాయం చూడనున్నారు. రెండు గ్రామాల్లోని 2800 ఎకరాల వ్యవసాయ భూమిని కలిపి 14 బిట్లుగా (200 ఎకరాల చొప్పున) విభజించారు. ఒక్కో బిట్టుకు 14 నెటాజెట్ మిషన్ల ద్వారా ఆటోమేటిక్గా పొలాలకు నీళ్లు పారుతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. ఇక్కడి భూమిని విత్తన కంపెనీ దత్తత తీసుకున్నది. కంపెనీ వాళ్లే సాగుచేసిన పంటలకు ముందుగానే ధర నిర్ణయిస్తారు. పొత్తుల వ్యవసాయం. భూమి ఎవరిది వారిదే, డబ్బులు ఎవరివి వారికే ఉంటాయి.
మీరూ..మేమూ బాగుపడుతామని చెబితే మహారాష్ట్ర ఒప్పుకున్నది… ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. స్వయంగా నేనే 7న మహారాష్ట్ర వెళుతున్నా. 8న అక్కడి సీఎంతో ఒప్పందం చేసుకుంటాను. ప్రాజెక్టుల నిర్మాణంతో మీరు బతుకుతరు.. మేమూ బతుకుతం అని చెబితే వాళ్లు ఒప్పుకున్నరు. ప్రాజెక్టుల నిర్మాణంతో కాలువల ద్వారా వచ్చే గోదావరి జలాలతో తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడనున్నది. కొమురవెల్లి, కొండపోచమ్మ(పాములపర్తి) రిజర్వాయర్ల నిర్మాణ పనులు 15 రోజుల్లో మొదలు కానున్నాయి.
వచ్చే రెండున్నరేండ్లలో పాములపర్తి రిజర్వాయర్లలో నీళ్లుంటాయి. ప్రాజెక్టులో నీళ్లుంటే మనం నెత్తిమీద కుండపెట్టుకున్నట్టే. ఒక్కసారి గోదావరి నీళ్లొచ్చాయంటే 360 రోజులూ చెరువులు, కూడవెళ్ళి వాగు పూర్తిగా నిండుతాయి. అప్పుడు మనం ఎవ్వరికి మోతాదు ఉండం. ఇది దృష్టిలో పెట్టుకునే దేశంలోనే ఆదర్శంగా ఉండాలని ఎర్రవల్లి, నర్సన్నపేటల వెంటపడుతున్నా. ఈ రెండు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి తన్లాడుతున్నా. ఒక్కమాట, ఏకాభిప్రాయంతో ఉన్న గ్రామస్థులకు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హనుమంతరావు, ఆర్డీవో ముత్యంరెడ్డి, ఇతర అధికారులకు అభినందనలు. మీ వెంట నేనున్నా. ప్రభుత్వం అండగా ఉన్నది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో మాదిరిగా ఇక్కడా మహిళలు ఇంటి యజమానులు కావాలి.. అన్నారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్రోస్, జేసీ వెంకట్రామ్రెడ్డి, గడా అధికారి హన్మంతరావు, ఆర్డీవో ముత్యంరెడ్డి, సర్పంచ్ భాగ్యబాలరాజు, జెడ్పీటీసీ రామచంద్రం, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కిష్టారెడ్డి పాల్గొన్నారు.