-మొదటిరోజు పెద్దపల్లి జిల్లాలో, రెండోరోజు భూపాలపల్లిలో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ విద్యుత్ ప్లాంట్ పనుల పరిశీలన -జెన్కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష.. రాత్రికి ఇక్కడే బస -రేపు ఉదయం కాళేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు -కన్నెపల్లి పంప్హౌస్, మేడిగడ్డ బరాజ్ పనుల పరిశీలన
ముఖ్యమంత్రి కేసీఆర్ శని,ఆదివారాల్లో రెండు రోజులపాటు జిల్లాల పర్యటన ఖరారైంది. మొదటి రోజు పెద్దపల్లి జిల్లాలో, రెండోరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీని సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయి.
జెన్కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష.. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులపాటు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి నూతన విద్యుత్ ప్లాంట్ పనులను పరిశీలించారు. మరోసారి విద్యుత్ ప్లాంట్ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి శనివారం రామగుండం రానున్నారు. ప్లాంట్ను సందర్శించిన అనంతరం జెన్కో, ఎన్టీపీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో బస చేస్తారు.
రెండోరోజు పర్యటన ఇలా.. ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బరాజ్ పనులు పరిశీలిస్తారు.
ఏర్పాట్ల పరిశీలన.. సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన రెండు హెలీపాడ్లతోపాటు ప్లాంట్ నిర్మాణ పనులు, ముఖ్యమంత్రి బస చేసే జ్యోతిభవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు.