-60 లక్షల సభ్యులతో అజేయశక్తిగా టీఆర్ఎస్
-మనందరి కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్
-మీ యోగక్షేమాలు ప్రధానకార్యదర్శుల బాధ్యత
-పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్
-80 మంది కార్యకర్తల కుటుంబీకులకు చెక్కులు
-బీమా కోసం 18.39 కోట్ల ప్రీమియం చెల్లింపు

తెలంగాణ రాష్ట్ర సమితి అజేయశక్తిగా ఎదిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 60 లక్షలకు పైగా గులాబీ సైన్యమున్న కుటుంబం టీఆర్ఎస్దని చెప్పారు. కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకొంటామని చెప్పారు. కుటుంబ పెద్దను కోల్పోయామనే మనోవేదనకు ఎవరూ గురికావొద్దని.. మనందరికీ కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని ధైర్యం చెప్పారు.
ప్రమాదవశాత్తు మరణించిన 80 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు పార్టీ అందించే బీమా చెక్కులను మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో అందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తల కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. వారితో కలిసి భోజనంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. మీతో గడిపింది కొద్దిక్షణాలే. మీ సాధకబాధకాలు తెలుసుకొని, కుటుంబంలో పెద్ద దిక్కును, ఆత్మీయులను కోల్పోయిన మీ కుటుంబానికి పెద్దదిక్కుగా పార్టీ ఉంటుంది.
మన పార్టీకి పెద్దదిక్కుగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నరు. ‘మాకు ఇల్లులేదు.. పిల్లలు చిన్నవాళ్లు… గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని కొందరు.. ప్రభుత్వమే ఆదుకోవాలని, చదువుకున్న పిల్లలకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని మరికొందరు.. ఇంకొంతమంది పింఛన్లు రావటంలేద’ని అడిగారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం మీకున్నం. రాబోయే 10-15 రోజుల్లోనే ఇప్పుడు ఇవ్వబోయే రూ.2 లక్షల చెక్కుతోపాటుగా మీరు అడిగిన పనులను చేసి పెట్టే బాధ్యత మాది. మీలో ఏ ఒక్కరూ ‘అయ్యో మాకు ఎవరూ లేరు’ అనే భావనలో ఉండొద్దు.

మీ ఇంటివాడు దూరం అయ్యాడని బాధపడకూడదు. మనందరిదీ చాలా పెద్ద కుటుంబం. 60 లక్షల మంది కుటుంబం. మనందరికీ పెద్దిదిక్కుగా సీఎం కేసీఆర్ ఉన్నరు. ఏడాదిగా దాదాపు 950 మంది కార్యకర్తలు, నాయకులు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబాల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జనరల్ సెక్రటరీలపైనే ఉన్నది. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాల యోగక్షేమాలను స్థానిక శాసనసభ్యులతో కలిసి చూసుకోవాలి. అప్పుడే మన గౌరవం, పార్టీ గౌరవం ఇనుమడింపజేసినవాళ్లం అవుతాం.
గురుకులాల్లో విద్యాబుద్ధులు
ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలు, నాయకుల కుటుంబాల్లోని పిల్లల విద్యాబుద్ధులకు రాష్ట్రంలో 945 పైచిలుకు గురుకుల పాఠశాలలున్నాయి. వాటిల్లో 4,70,000 మంది విద్యార్థులు చదువుతున్నరు. ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఏటా రూ.1,20,000 ఖర్చుపెడుతున్నది. అట్లాంటి మంచి స్కూళ్లల్లో మన పిల్లలకు ఎవరికైనా కావాలంటే అడ్మిషన్లు ఇప్పిస్తం. 60 లక్షల కుటుంబ సభ్యులు కలిగిన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. ఈ 60 లక్షల మంది కుటుంబసభ్యులను కంటికి రెప్పలాగా పార్టీ కాపాడుకుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ సైనికులకు పార్టీ అండగా ఉంటుంది. ఈ సందేశం ప్రతి కార్యకర్తకు చేరాలి.
రూ.18.39 కోట్లు బీమా ప్రీమీయం చెల్లింపు
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు, నాయకులకు ప్రమాద బీమా ప్రీమియం మొత్తాన్ని (రూ.18,39,36,000) మంత్రి కేటీఆర్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యర్శులు, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రొఫెసర్ శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బండి రమేశ్, ఫరీదుద్దీన్, బస్వరాజు సారయ్య, నారదాసు లక్ష్మణ్రావు, సుధీర్రెడ్డి, బీ వెంకటేశ్వర్లు, నూక ల నరేశ్రెడ్డి, సోమ భరత్కుమార్, ఎమ్మెల్సీ బీ గంగాధర్గౌడ్, పార్టీ నాయకులు వేణుగోపాలచారి, వాసుదేవరెడ్డి, రాకేశ్, సతీశ్రెడ్డి, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, పుల్లా పద్మావతి పాల్గొన్నారు.

న్యాయం చేస్తారనే నమ్మకం కుదిరింది
నా భర్త వెంకన్న టీఆర్ఎస్ కార్యకర్త. నాకిద్దరు పిల్లలు. కొడుకు హ్యాండీక్యాప్డ్. ఏడేండ్ల పాప. రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయారు. నేను ఇంటర్ చదివిన. ఊర్లో టైలరింగ్ చేస్తా. ‘పిల్లలను మేమే చదివిస్తాం, నీకేదైనా శాశ్వత ఉపాధి మార్గం చూపిస్తాం’ అని మంత్రి కేటీఆర్ సారు చెప్పిండు. అన్నరంటే గ్యారెంటీగా చేస్తరనే నమ్మకం ఉన్నది.–ఉండాడి వనజారాణి, గార్ల, ఇల్లందు
మా నాయిన లెక్క అర్సుకున్నడు
మా నాయిన ముచ్చట పెట్టినట్టే పెట్టిండు కేటీయారు. కష్టసుఖాలు ఇసారిచ్చిండు (కండ్లల్లో సుడులు తిరుగుతున్న నీళ్లతో) కొడుకు. నా భర్త చనిపోయి 15 ఏండ్లయింది. పెద్ద కొడుకు కూడా పోయిండు. చిన్న కొడుకు ప్రవీణ్ మొన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఇల్లు ముంగిలి లేదని చెప్పంగనే ‘ఇప్పిస్తమ్మ.. నేను చూసుకుంట’ అని కేటీఆర్ ధీరనిచ్చిండు.
-కోరబోయిన యాదమ్మ, సదాశివపేట (ఆత్మకూర్)
టీఆర్ఎస్సే ఆదుకొన్నది
నా భర్త బుర్హానుద్దీన్. లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి పార్టీల పనిచేసేది. కేసీఆర్ మీటింగ్ ఎక్కడుంటే అక్కడికి పోయేది. ఈ మధ్యనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఆయన చనిపోయినంక ఎవరూ ఆదుకోలేదు. టీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు నా కుటుంబాన్ని ఆదుకున్నది. కేటీఆర్ సాబ్తో భోజనం చేస్తానని అనుకోలేదు. మా అందరికీ ఆయన ధైర్యం చెప్పారు.
–అస్మా సుల్తానా, చకినాలపల్లి, నాగర్కర్నూల్
రూ. 2లక్షల వస్తయని అనుకోలే
ఇన్సూరెన్స్ పైసలు వస్తయంటే నమ్మలేదు. అందరు.. గట్లనే అంటరు.. ఎవలియ్యరు అన్నరు. కానీ ఇక్కడికి పిలిచి అన్నంపెట్టి, బస్ కిరాయిలిచ్చి రొండు లక్షల చెక్కు ఇచ్చిండ్లు. ఈ పైసలతోని
–మలవాద బుగ్గమ్మ, వాల్పల్లి, కొడంగల్
ఎవలకు ఒక్కపైస ఇయ్యలె
నా భర్త వినోద్. కూలీ చేసుకొని బతికే కుటుంబం మాది. నాకో బిడ్డ. 17 నెల్ల పాప. యాక్సిడెంట్లో తలపగిలి భర్త చనిపోయిండు. పింఛన్ ఇప్పిస్తామన్నరు. నాకు ఇప్పుడు రెండు లక్షల చెక్కు ఇచ్చిండ్లు. మా ఆడిబిడ్డ (రాజగంగు)తో వచ్చిన. బస్సు కిరాయిలు కూడా ఇచ్చిండ్లు. వాళ్లువీళ్లు అంతో ఇంతో ఖర్సయితదన్నరు. కానీ ఎవలు ఒక్కపైస అడగలేదు.
–అకూరు హర్షిత, మెండోరా, బాల్కొండ