-మనదే హ్యాట్రిక్.. మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి
-విపక్షాల్లో సీఎంకు సమ ఉజ్జీలు లేరు.. అంతా మరుగుజ్జులే
-బీజేపీవి శిఖండి రాజకీయాలు.. కాంగ్రెస్సే మా ప్రత్యర్థి
-చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతాం
-వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు
-జేడీ(ఎస్) కోరితే కర్ణాటకలో ప్రచారం చేస్తాం
-నితీశ్, మమతా బెనర్జీ మాతో టచ్లోనే ఉన్నారు
-జూన్లో పార్టీ విద్యార్థి, యువజన సమ్మేళనాలు
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
-నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ

2001, ఏప్రిల్ 27న ఎగిరిన గులాబీ జెండా.. రోజురోజుకూ మరింత సమున్నతంగా రెపరెపలాడుతున్నది. ఇప్పుడు 22 ఏండ్ల మైలురాయిని దాటి దేశానికి ఓ ఆశాకిరణంగా మారింది. పార్టీ ఆవిర్భావ వేడుకల తరుణంలో శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 279 మంది ముఖ్యనేతలతో నేడు తెలంగాణ భవన్లో జరుగనున్న ప్రతినిధుల సభ బీఆర్ఎస్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నది.
జాతీయ పార్టీ అంటే వెంటనే 543 లోక్సభ స్థానాలకు పోటీచేయాలనే నియమం ఏమీలేదు. బీజేపీ 2 ఎంపీ స్థానాల నుంచి 303 ఎంపీల స్థాయికి రాత్రికి రాత్రే రాలేదు. మాకు తొందరలేం లేదు. దేశ ప్రజల మనోభవాలను, వారి ఆకాంక్షలను గెలుచుకుంటూ వెళతాం. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాం. మా నాయకుడు కేసీఆర్ వ్యూహాత్మక ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. వాటిని ఎవరూ ఆపలేరు.
– మంత్రి కేటీఆర్
దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 90-100 స్థానాలు సా ధించి, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముఖాముఖి మాట్లాడా రు. పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం, మహారాష్ట్రలో పార్టీకి వస్తున్న ఆదరణ, జాతీయ రాజకీయాలు.. పలు అంశాలను వివరించారు.
అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కసరత్తు ఎలా ఉంది? మూడోసారి విజయం సాధిస్తారా?
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. రాష్ట్రానికి మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యి దక్షిణాది నుంచి హ్యాట్రిక్ సాధించిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. మేం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతాం. తొ మ్మిదేండ్లలో తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఇదే చెప్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరిగాయి. అద్భుతంగా కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్లో పార్టీ విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహించనున్నాం. విద్యారంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, వెయ్యి కి పైగా గురుకులాల ఏర్పాటు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, నిరంతరం ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగాల భర్తీ చేపట్టడం వంటివాటిని విద్యార్థులకు, యువతకు వివరిస్తాం. వరంగల్లో అక్టోబర్లో సభ ఉన్నది. నిరంతరం ఏదో ఒక సభ, సమావేశం నిర్వహిస్తూనే ఉన్నాం. ప్ర జల్లోనే ఉంటున్నాం. ప్రజల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడుతున్నాం. గురువారంనాటి ఆవిర్భావ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల రూట్మ్యాప్పై స్పష్టత ఇస్తారు.
మూడోసారి కూడా కేసీఆరే సీఎంగా ఉంటారా?
ముమ్మాటికీ కేసీఆరే సీఎంగా ఉంటారు. ఇప్పుడాయనకు 69 సంవత్సరాలు మాత్రమే. పూర్తిస్థాయిలో యాక్టివ్గా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడన్కు ఇప్పుడు 80 దాటాయి. మళ్లీ ఆయన అధ్యక్ష పదవికి పోటీపడ్తా అంటున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థో కూడా తెలియదు. ఆ పార్టీల్లో కేసీఆర్కు సమ ఉజ్జీలు లేరు. అంతా మరుగుజ్జులే ఉన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్షా అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు..?
కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్షా కనీస అవగాహన లేకుండా ముస్లిం రిజర్వేషన్లపై మా ట్లాడారు. ఆయన అజ్ఙానానికి ఇది పరాకాష్ఠ. ముస్లింలకు రిజర్వేషన్లను వారి మతాన్ని బట్టి ఇవ్వలేదు. కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్ రాజేం ద్ర సచార్ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. కర్ణాటకలో కూడా ఇలాగే అమిత్షా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడారు. సున్నిత అంశాల గురించి మాట్లాడేటపుడు వాటిపై అవగాహన ఉండాలి. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. కోర్టులో కేసు ఉన్నపుడు హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ అంశంపై మాట్లాడవద్దు. మాట్లాడితే సబ్జ్యుడిస్ అవుతుంది. అమిత్షాకు ఈపాటి అవగాహన కూడా లేదు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం ఎందుకు చేయడంలేదు.? అక్కడ మీ మద్దతు ఎవరికి?
జనతాదళ్ (ఎస్)కు మా మద్దతు ఉంటుం ది. కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కార్యక్రమానికి కూడా వచ్చారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాదు. జేడీ(ఎస్) అధికారంలోకి రావాలని మేం కోరుకుంటున్నాం. అక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయడంలేదు. కుమారస్వామి కోరితే బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో ప్రచారం చేస్తుంది. కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నది. మెజార్టీ రాకపోయినా అధికారం మాదే అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి అలవాటే. అయితే ఈసారి బీజేపీకి అలాంటి చాన్స్ ఉండకపోవచ్చు. అక్కడి ప్రజలు బీజేపీకి తగిన జవాబు చెప్తారనే ఆశిస్తున్నా.
తెలంగాణ గవర్నర్ తాజాగా పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు కదా.. దీనిపై ఏమంటారు ?
గవర్నర్ తీరు విడ్డూరంగా ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని శాసనసభలో చర్చించి, ఆమోదించిన బిల్లులను నెలలతరబడి తన వద్దనే పెట్టుకున్నారు. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే వాటిని ఆమోదించలేదు. చివరకు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బిల్లుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు. ఆమె ఒక్కొక్క బిల్లును ఒక్కో విధంగా పంపించారు. కొన్నింటిపై కొర్రీలు వేశారు. కొన్నింటిని తిరస్కరిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సబబేనా? దేశంలో అసలు గవర్నర్ల వ్యవస్థనే అవసరం లేదు. ఒక్క తెలంగాణాలోనే కాదు.. తమిళనాడు, కేరళ, బెంగాల్.. ఇలా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది. ఎక్కడైతే బీజేపీయేతర రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదో.. అక్కడ గవర్నర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాలి. అయితే, విచిత్రమేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లు మామూలుగానే ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ రాజ్పథ్ను కర్తవ్యపథ్ అని పేరు మారుస్తూ.. వలస పాలకుల గుర్తులు ఇంకా మనకు అవసరమా అని ప్రశ్నించారు. మరి గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ. దీని అవసరం మనకు లేదు.
ఈడీ, సీబీఐలను మీరు వేటకుక్కలు అన్నారు. సిట్ను కూడా బీజేపీ వాళ్లు అదే మాట అంటున్నారు కదా?
సీబీఐ, ఈడీల గురించి నేను చెప్పడం కాదు.. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చెప్పారు. అమిత్షా కూడా ఒక సందర్భంలో సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని, మోదీ పేరును బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలను కేం ద్రంలో అధికారంలో ఎవరుంటే వారు వాడుకుంటారు. రాష్ట్రంలో పేపర్ల లీకేజీపై మేం వేసిన సిట్ పారదర్శకంగా పనిచేస్తున్నది. సిట్ విచారణపై రాజకీయ ఆరోపణలే తప్ప.. నిజం గా ఒక్క ఆరోపణ కూడా బయటి నుంచి రాలే దు. ఇక్కడి సిట్ను తప్పుపడితే మరి ఉత్తర ప్రదేశ్లో కూడా అక్కడి సీఎం యోగి కూడా ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై సిట్ వేశారు.
రాష్ట్రంలో అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారు?
మాది రైతు ప్రభుత్వం. మా నినాదమే ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’. మా నేత రైతు పక్షపాతి. రాష్ట్రంలో అకాలవర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం. ఇప్పటికే సీఎంగారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. ప్రతి ఎకరానికి రూ.10 వేల సహాయాన్ని ఇటీవల వచ్చిన వర్షాల సందర్భంగా ప్రకటించారు. నిధులు కూడా విడుదల చేశారు. ఇప్పుడు కూడా కచ్చితంగా సహాయం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పీఎం ఫసల్ బీమాతో ఏ మాత్రం ఉపయోగంలేదు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఫసల్ బీమా పథకం నుంచి బయటకు వచ్చాయి. ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఫసల్ బీమా పథకం లేదు.
కేంద్రం నుంచి సహాయం కోరుతారా?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకోవడం కల్ల. కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలు చెప్తే గోడకు చెప్పినట్టే. వాళ్లు ఏమాత్రం సహాయం చేయరు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనే క పర్యాయాలు మేం నివేదికలు ఇచ్చాం. కానీ, ఏనాడూ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మీ కార్యాచరణ ఏమిటి?
బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ వంటి కేంద్ర ప్రభు త్వ సంస్థలను ప్రైవేకరించడంపై మేం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టాం. మే ఒకటో తేదీన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలన్నదే మా ధ్యేయం. పార్టీ పరంగా మేం నిరంతర కార్యక్రమాలు చేపడ్తాం.