· కేరళలోని గ్రామపంచాయితీల్లో మంత్రి క్షేత్రస్ధాయి పర్యటన
· పంచాయితీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో భేటి
· కేరళ గ్రామ పంచాయితీ వ్యవస్ధను స్పూర్తిగా తీసుకుంటాం
· సమీకృత గ్రామ పంచాయితీ భవన సముదాయాల పరీశీలన
· కేరళలోని గ్రామ పంచాయితీలు అధికారాలతో పాటు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాయి
గ్రామ పంచాయితీ వ్యవస్ధలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. ఇందుకు అవసరమైన పలు సంస్కరణల అధ్యయనం కోసం తన రెండు రోజుల కేరళ పర్యటనలో అక్కడి పంచాయితీ రాజ్ వ్యసస్దను పరిశీలించారు. కేరళలోని పలు గ్రామాలను, గ్రామ పంచాయితీలను మంత్రి సందర్శించారు.
తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించి, అక్కడి పంచాయితీ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీలతో పాటు ఇతర సిబ్బంది మరియు గ్రామస్ధులతో వివిధ అంశాలమీద సంభాషించారు.
ఈ సందర్భంగా మాట్లాడూతూ కేరళలోని గ్రామ పంచాయితీలు అధికారాలను ఉపయోగించుకుని వాటి బాధ్యతలను చాల సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాయన్నారు. కేరళ పంచాయితీ వ్యవస్ధను యధాథంగా తెలంగాణకి వర్తింప చేయలేకున్నా…దాని స్పూర్తితో కేరళలో విజయవంతమైన పలు అంశాల అమలును పరిశీలిస్తామన్నారు. కేరళలో కేవలం 964 విశాలమైన గ్రామ పంచాయితీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం సూమారు ఏనిమిది వేల నాలుగు వందల పైచిలుకు గ్రామ పంచాయితీలున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
కేరళలోని సమీకృత గ్రామ పంచాయితీ భవన సముదాయంలోని పలు వసతులను అయన పరిశీలించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట పౌరసేవలు అందిస్తున్న తీరుని అయన ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామ పంచాయితీ భవన ప్రాంగణంలో 6 సెక్షన్లతో కూడిన పాలనా సౌకర్యాలు, ప్రజల నుంచి ధరఖాస్తుల స్వీకరణకి అనుసరిస్తున్న టోకెన్ విధానం, గ్రామ పంచాయితీ భవనంలోనే గ్రామ కార్యదర్శి, సర్పంచ్ కార్యలయాలతోపాటు, అధునాతన సమావేశ మందిరం వంటి సౌకర్యాలను మంత్రి తారకరామారావు పరిశీలించారు. గ్రామ పంచాయితీ ప్రాంగణంలోనే ఐసిడియస్ తో పాటు, గ్రామీణా నీటి సరఫరాకి సంబంధిచిన జలనిధి, పేదరిక నిర్మూలన మరియు మహిళ సంఘాలకి పథకమైన కుటుంబ శ్రీ సేవలు ఓకేచోట అందుబాటులో ఉండడం అకట్టుకుందన్నారు.
గ్రామ పంచాయితీలు పన్నులు వసూలు చేస్తూ, ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్స్, సహయంతో గ్రామాలను సమర్ధంగా అభివృధ్ది చేస్తున్నాయన్నారు. పంచాయితీలు అధికారాలతోపాటు భాధ్యతలను స్వీకరించేందుకు ముందకురావాలని, అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తాము చెప్తున్నమాట ముమ్మాటికి వాస్తవమని, తమ కేరళ పర్యటనలో తెలిందన్నారు. కేరళలోని గ్రామ పంచాయితీలకి అప్పగించిన వివిధ భాధ్యతలను సైతం విజయవంతంగా అమలు చేస్తున్నాయన్నారు. తెలంగాణలోను గ్రామ పంచాయితీలు తమ పరిధిలో ఉన్న పారిశుద్యం వంటి భాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయితీల క్షేత్ర స్ధాయి పర్యటన తర్వత కేరళ పంచాయితీరాజ్ వ్యవస్ధ రూపకర్త అయిన విజయానంద్ (భారత ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి) పాటు జెయం వర్ఘీస్ వంటి సీనీయర్ కేరళ ప్రభుత్వాధికారులతో భేటి అయ్యారు. కేరళలోని పంచాయితీరాజ్ వ్యవస్ధ వీకేంద్రీకరణ, పనితీరు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేరళలోఉన్న జిల్లా స్థాయి పంచాయితీరాజ్ ట్రిబ్యూనల్స్ తో పాటు బలమైన అంబూడ్స్ మన్ వ్యవస్ధ వల్ల పంచాయితీరాజ్ వ్యవస్ధ అక్కడ బలంగా ఉందన్నారు. కేరళ నమూనా స్పూర్తితో తెలంగాణలో అమలు చేయదగిన అంశాలపైన వారి సలహాలు తీసుకున్నారు. కేరళ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన కుటుంబ శ్రీ పథకాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలతో పాటు పథకం ద్వార సాధించిన విజయాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో గ్రామ పంచాయితీల దాక అధికార వికేంద్రీకరణకి చేపట్టిన పథకం KERALA LOCAL GOVERNMENT SERVICE DELIVERY PROJECT తాలుకు వివరాలను ప్రత్యేకంగా తెలుసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ను అధేశించారు.
ఈ పర్యటనలో మంత్రి కె.తారక రామారావుతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ ఉన్నారు.