-దుబ్బాకలో బీజేపీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది -ఎంత హంగామా చేసినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు -డిపాజిట్ దక్కదనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం -కల్యాణలక్ష్మిలో కేంద్రం వాటా ఉన్నట్టు దమ్ముంటే చెప్పించండి -బీజేపీ నేతలకు మంత్రి తలసాని సవాల్

దుబ్బాకలో తప్పులమీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని పశుసంవర్ధకశాఖ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. వారు పద్ధతి మార్చుకోకపోతే మంచిదికాదని మండిపడ్డారు. కేసీఆర్ సారథ్యంలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక బీజేపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు సమీప బంధువు జితేందర్రావు ఇంట్లో డబ్బు దొరికినట్టు సిద్దిపేట సీపీ విడుదల చేసిన వీడియోలో స్పష్టమవుతుంటే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతున్నాయని విమర్శలు చేయడం బీజేపీ నేతల అవివేకానికి నిదర్శనమన్నారు. సిద్దిపేట కలెక్టర్ బదిలీ ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో భాగమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే మంత్రి హరీశ్రావు, టీఆర్ఎస్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్ ఇండ్లలోనూ పోలీసులు సోదాలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకే ఓటు వేస్తామంటూ ఎప్పుడో డిసైడ్ అయ్యారని.. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారివైపు మొగ్గుచూపరని చెప్పారు.
హంగూ ఆర్భాటాలు వద్దనే.. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారమంతా జిల్లా మంత్రి హరీశ్రావు, ఎంపీ, ఎమ్మెల్యేలే చూసుకుంటారని.. మిగతావారెవరూ అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పారని తలసాని తెలిపారు. అందుకే తామెవరమూ అక్కడ ప్రచారానికి వెళ్లడం లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎక్కడెక్కడినుంచో నాయకులను తీసుకొచ్చి మండలాలు, గ్రామాలవారీగా కేటాయించి నానా హంగామా చేస్తున్నాయని చెప్పారు. డబ్బులు పంపిణీ చేసేందుకు బీజేపీ ఎలా సిద్ధపడిందో ఆ పార్టీ నాయకులు, వారి బంధువుల ఇండ్లలో దొరికిన డబ్బే నిదర్శమని తెలిపారు.
మీడియాది బాధ్యతాయుతమైన పాత్ర సున్నితమైన, భావోద్వేగపూరిత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేముందు మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని మంత్రి తలసాని అభిప్రాపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ భారీఎత్తున డబ్బు పంపిణీకి సిద్ధపడిందనే ప్రచారం జరుగుతుంది? అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అసలు దొరికిన డబ్బు ఎవరిది? ఎవరు పంచేందుకు సిద్ధంగా ఉన్నారో తెలుస్తూనే ఉన్నది కదా? అని పేర్కొన్నారు. రెండ్రోజులుగా దుబ్బాక, సిద్దిపేటలో జరుగుతున్న పరిణామాలపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అతిచేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నదని.. ఇలాంటి సమయంలో మీడియా కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు.
టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు: ఎమ్మెల్సీలు దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును బీజేపీనే కాదు.. మరే శక్తీ ఆపలేదని ఎమ్మెల్సీలు ప్రభాకర్, ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దుబ్బాకలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా ఒకసారి పోటీచేసి కనీసం డిపాజిట్ కూడా దక్కని రఘునందన్రావు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికెళుతున్నారని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినా టీఆర్ఎస్ దరిదాపుల్లోకి కూడా రాలేవని తేలిపోయిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని.. మిగితా రాష్ర్టాలపై చేసే బద్మాష్గిరీ తెలంగాణలో చెల్లదని ఎం శ్రీనివాస్రెడ్డి చెప్పారు.
మీరెంత..మీ బలమెంత? టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాస్లని.. బాధ్యతాయుతమైన పార్టీగా, వ్యక్తులుగా తాము వారిపట్ల వ్యవహరిస్తున్నామని తలసాని అన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీలు, నాయకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున మిగతా రాష్ర్టాల్లో చేసినట్టు తెలంగాణలో చేస్తే కుదరదని హెచ్చరించారు. ‘60 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీమాది.. ఒక్కసారి సంస్కారాన్ని పక్కకు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి’ అంటూ చురక అంటించారు. బాధ్యతగల పదవిలో ఉన్నవాళ్లు హోదాను మరచి మాట్లాడటం సరైంది కాదని, కేంద్రమంత్రి హోదాలో కిషన్రెడ్డి కనీసం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా మాట్లాడుతూ అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. కొత్తగా గెలిచిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్కిట్ వంటి పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తున్నదంటూ బీజేపీ నేతలు పేర్కొనటం సిగ్గుచేటని.. వారికి దమ్ముం టే ఈ పథకాల్లో కేంద్రం వాటా ఉన్నదనే జీవో చూపించాలని డిమాండ్ చేశారు.