-అంతకంతకూ బలపడుతున్న టీఆర్ఎస్
-2014లో పడిన ఓట్లు 69,496 ఓట్లు
-తాజా ఉప ఎన్నికలో 97,006 ఓట్లు కైవసం
-సుమారుగా 5 శాతం ఓట్ల పెరుగుదల
-ప్రతి ఎన్నికలోనూ పెరుగుతున్న ఓట్ల శాతం
-ఉమ్మడి నల్లగొండలో సీట్లన్నీ టీఆర్ఎస్వే
-వాపును చూసి బలుపనుకుంటున్న బీజేపీ
-రాజగోపాల్కు వచ్చిన ఓట్లన్నీ వ్యక్తిగతమే
-గత ఎన్నికల్లో పడిన కాంగ్రెస్ ఓట్లే బీజేపీకి బదిలీ

దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ క్రమంగా బలపడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మునుగోడు కంచుకోట. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సీపీఐ, 2014లో టీఆర్ఎస్ గెలిచింది. అప్పుడు టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు 69,496. సమీప ప్రత్యర్థిపై 32 వేల పైచిలుకు మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 38.13 శాతంతో టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 2018 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొన్ని కారణాలతో ఓటమి పాలైనా ఓట్లను పెంచుకున్నది.
ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 74,687(37.56 శాతం) ఓట్లు పోలయ్యాయి. అంతకుముందుతో పోలిస్తే ఐదు వేల ఓట్లు అదనం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 97,239 ఓట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్య 22వేల పైచిలుకు ఓట్ల తేడా కనిపించింది. ఆదివారం వెలువడిన ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ తన ఓట్లను గణనీయంగా పెంచుకొన్నది. మొత్తం 97,006 ఓట్లను(42.9 శాతం) సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 22,319 ఓట్లను సాధించింది. కారును పోలిన రోటీ మేకర్, రోడ్డు రోలర్ గుర్తులకు పడిన ఆరు వేల ఓట్లు కూడా వాస్తవానికి టీఆర్ఎస్కు పడాల్సినవే. అంటే అదనంగా సాధించిన ఓట్లు 28 వేలుగా పరిగణలోకి తీసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. టీఆర్ఎస్కు సుమారు లక్ష మంది ఈ ఎన్నికలో ఓటేశారు. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా దాదాపు 28 వేల మంది ఓటర్లు మద్దతు పలికారు.
ఇంటిపార్టీగా టీఆర్ఎస్
కోట్లు కుమ్మరించినా మునుగోడులో బొక్కబోర్లా పడ్డ బీజేపీ, ఓటమిని మరో రకంగా సమర్థించుకొనే ప్రయత్నం నవ్వు తెప్పిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచామని, ఇప్పుడు స్వల్ప తేడాతో ఓడిపోయామ ని.. అంటే బలం పెరిగినట్టేనని గప్పాలు కొడుతున్నది. వాస్తవానికి రాజగోపాల్రెడ్డికి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్లో ఉన్నప్పటి పరిచయాల వల్ల వ్యక్తిగతంగా పడ్డవే తప్ప, బీజేపీకి వేసినవి కావ ని మునుగోడులో అదే పువ్వుగుర్తుకు ఓటేసినవాళ్లు సైతం చెప్తున్నారు.
గణాంకాలు సైతం అదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కాంగ్రెస్కు సైతం పడిన ఓట్లు కూడా పాల్వాయి కుటుంబంతో ఉన్న అనుబంధంతో వచ్చినవే. రాజగోపాల్, స్రవంతికి పడిన ఓట్లు వ్యక్తిగతంగా పడి తే, టీఆర్ఎస్కు మాత్రం పార్టీని చూసి ఓట్లు వేస్తున్నారు. మునుగోడులో దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపిన టీ ఆర్ఎస్ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అంతకంతకూ మద్దతు ను ప్రకటిస్తూ పార్టీని బలపరుస్తూ వెన్నుదన్ను గా నిలుస్తున్నా రు. ఉప ఎన్నికలోనూ మరోసారి మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావిస్తూ తీర్పునిచ్చారు. దక్షిణ తెలంగాణలో, అందులోనూ కాంగ్రెస్కు కంచుకోటలాంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ బలపడుతున్నది.
హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 12 స్థానా లు టీఆర్ఎస్వే. ఇదే కదా పార్టీ బలానికి, పెరుగుదలకు సూచిక. మునుగోడు ఉప ఎన్నిక విజయంతో టీఆర్ఎస్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్, 5సార్లు సీపీఐ, ఒకసారి టీఆర్ఎస్ గెలిచాయి. ఉప ఎన్నికతో కలిసి రెండోసారి టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీ ఆర్ఎస్ అంతకంతకూ బలాన్ని పెంచుకుంటూ విస్తరిస్తున్నది. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు పట్టు సాధిస్తున్నది.
వాపును చూసి బలుపనుకుంటున్న బీజేపీ
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డికి వచ్చిన ఓట్లను చూసి బీజేపీ పొంగిపోతున్నది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ బలం నామ మాత్రమే. బీజేపీకి 2009లో 5.59 శాతంతో 9,185 ఓట్లు వచ్చాయి. 2018 డిసెంబర్లో 6.39 శాతం ఓట్లతో 12,704 ఓట్లనే సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి 86,697 ఓట్లను సాధించారు. వాస్తవంగా ఇక్కడ నాలుగేండ్లల్లో బీజేపీ చేసిన ఘనకార్యాలు ఏమీలేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన రాజగోపాల్రెడ్డి 97,239 ఓట్లు సాధించారు.
అప్పుడు బీజేపీ ఓట్లు 12,704. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరపున రాజగోపాల్రెడ్డి సాధించిన ఓట్లు 86,697. అదే సమయంలో కాంగ్రెస్కు పడిన ఓట్లు 23,906. అంటే గత ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్కు తగ్గిన ఓట్ల సంఖ్య 73,333, ఇవన్నీ రాజగోపాల్ ఖాతాలోకి వెళ్లాయి. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన 12,704 ఓట్లు కూడా ఈ సారి రాజగోపాల్కు పడితే మొత్తం 86,037 అవుతాయి. రాజగోపాల్ సాధించిన ఓట్లు సైతం 86,697 కావటం గమనార్హం. 2018లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు మైనస్ అయ్యాయి. అవే ఓట్లు ఇక్కడ రాజగోపాల్రెడ్డికి జత కలిసినట్లు స్పష్టమవుతున్నది. ఇదంతా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నట్లుగా ఆ పార్టీ బలం ఎట్లా అవుతుందని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఇక తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు ప్రకటించుకోవడం అంటే వాపును చూసి బలుపు అనుకోవడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.